Telangana BJP news today(TS politics): ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలు ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో కీలక చర్చలు జరిపారు. వీళ్లిద్దరూ బీజేపీని వీడుతారంటూ కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అలా జరక్కుండా బుజ్జగించేందుకే.. ఢిల్లీ బీజేపీ వీరిద్దరిని పిలిపించింది.
ఈటల రాజేందర్, బండి సంజయ్ల మధ్య కోల్డ్ వార్. ఈటల తన హోదా పెరగాలని చూస్తున్నారు. బండి ఈటలను ఎదగకుండా అడ్డుకుంటున్నారు. చేరికల కమిటీ ఛైర్మన్గా ఉన్నా ఈటల పెద్దగా సాధించిందేమీ లేదు. పొంగులేటి, జూపల్లిలను మిస్ చేయడం.. ఆయన ఫెయిల్యూర్ ఖాతాలోనే వేస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పుంజుకోవడం.. ఈటలకు బ్రెయిన్ వాష్ చేస్తుండటంతో.. రాజేందర్ రాజకీయంగా డోలయమానంలో పడ్డారు. బీజేపీని వీడాలా? కాంగ్రెస్లో చేరాలా? అనే పొలిటికల్ జంక్షన్లో నిలబడ్డారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరో టైప్. ఆయన నిఖార్సైన కాంగ్రెస్ నేత. కేంద్రం తాయిలాలకు ఈజీగా చిక్కారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోయి పవరంతా పోగోట్టుకున్నారు. ఓటమి తర్వాత తత్వం బోధపడింది. ఈలోగా కర్నాటక ఫలితాలు మరింత పునరాలోచనలో పడేశాయి. కట్ చేస్తే.. కాంగ్రెస్ ప్రేమ రాయభారం నడుపుతోంది. అన్నయ్యా.. రా తమ్ముడూ అంటున్నాడు. బీజేపీతో అయ్యే పనిలా లేదని.. మన కాంగ్రెస్సే కదా.. మళ్లీ పోతే పోలా.. అనే ఆలోచనలో ఉన్నారు రాజగోపాల్రెడ్డి.
ఇలా ఈటల, కోమటిరెడ్డిలది ఒక్కోతరహా వ్యవహారం. కానీ, వారిద్దరి మధ్య.. ఇంకా చెప్పాలంటే.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న విశ్వేశ్వర్రెడ్డి, జితేందర్రెడ్డి, వివేక్.. లాంటి వలసవాదులు చాలామందిలో సొంతపార్టీపైనే సందేహం ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య రహస్య ఎజెండా ఉందా? పరోక్షంగా కలిసిపనిచేస్తున్నారా? అనే అనుమానం ఏమూలనో వేధిస్తోంది. కానీ, సరైన సమాధానం తెలీక.. పార్టీలో సరిగ్గా ఇమడలేకపోతున్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పీకల్లోతు ఇరుక్కుపోయినా.. సీబీఐ, ఈడీ పక్కాగా స్కెచ్ వేసినా.. చివరినిమిషంలో అరెస్ట్ నుంచి ఆమె ఎలా తప్పించుకున్నారు? తెరవెనుక ఏం జరిగింది? అనేదే వారి మెయిన్ డౌట్. ఆ విషయంలో కొండా ఓపెన్గానే బయటపడ్డారు. కర్నాటకలో బీజేపీ ఓటమితో.. తెలంగాణలోనూ అవే ఫలితాలు రిపీట్ అవుతాయా? కాంగ్రెస్ హవానే నడుస్తోందా? కేసీఆర్ను కొట్టగల శక్తి హస్తం పార్టీకే ఉందా? తమ టార్గెట్ కేసీఆరే కాబట్టి.. అందుకోసమే బీజేపీలో చేరారు కాబట్టి.. ఇప్పుడు మారిన, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. పార్టీ మారితే తప్పేంటని సీరియస్గా ఆలోచిస్తున్నారు ఈటల, కోమటిరెడ్డి.. తదితర నేతలు. ఆ విషయం తెలిసిన వెంటనే.. మాట్లాడుకుందాం రమ్మంటూ ఢిల్లీకి పిలిపించింది బీజేపీ అధిష్టానం. వెళ్తూ వెళ్తూ సంచలన వ్యాఖ్యలే చేసి వెళ్లారు రాజగోపాల్రెడ్డి. కేంద్రం వైఖరిలో మార్పు వస్తే అప్పుడు ఆలోచిస్తాం.. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో తమకు తెలుసు.. అంటూ బాంబు వేసి వెళ్లారు. మరి, తిరిగొచ్చాక ఏం అంటారో చూడాలి.