Latest Congress News in Telangana(TS politics): కాంగ్రెస్ కాక మీదుంది. నేనంటే నేనంటూ ప్రముఖ నేతలు హస్తం గూటికి చేరేందుకు సై అంటున్నారు. కమలదళం ఎంతగా బుజ్జగించినా.. కాషాయ కండువా కప్పుకునేది లేదన్నారు. కేసీఆర్ను గద్దె దించగల సత్తా.. కాంగ్రెస్కు మాత్రమే ఉందని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే, పొంగులేటి, జూపల్లి, దామోదర్రెడ్డి తదితర నేతలు.. చేతిలో చేయ్యేసేందుకు సిద్ధమవుతున్నారు. ఓ వారం రోజుల్లోనే రాహుల్ గాంధీని కలుస్తారని.. ఆ వెంటనే అఫిషియల్గా పార్టీలో చేరుతారని అంటున్నారు.
లాంఛనం కోసం పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. జూపల్లి, పొంగులేటిలను వాళ్ల ఇంటికెళ్లి మరీ ఆహ్వానించారు. వెంట ఎంపీ కోమటిరెడ్డినీ తీసుకెళ్లారు. మునుపెన్నడూ లేనిది సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ రామసహాయం సురేందర్రెడ్డి సైతం ఆ చర్చలకు హాజరవడం ఆసక్తికరం. ప్రొఫెసర్ జయశంకర్ వర్థంతి రోజున.. ఇలా కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. ముందుముందు మరింతమంది ప్రముఖ నేతలు కాంగ్రెస్లో చేరనున్నారని చెబుతున్నారు.
గడిచిన ఆరు నెలలుగా బాగా ఆలోచించాకే.. అన్నివర్గాలతో చర్చించాకే.. కాంగ్రెస్లో చేరబోతున్నట్టు పొంగులేటి, జూపల్లిలు స్పష్టం చేశారు. పార్టీలోకి రండి.. అంతా కలిసి పనిచేద్దాం.. కేసీఆర్ దుర్మార్గపు, అవినీతి పాలనను అంతమొందిస్తామని వారిద్దరిని కోరారు రేవంత్రెడ్డి. భవిష్యత్ పోరాట కార్యచరణపై కలిసి చర్చించారు. తాజా చేరికలతో పాలమూరు నుంచి ఖమ్మం వరకు, వయా నల్గొండ.. ఇలా కృష్ణా పరివాహక ప్రాంతమంతా హస్తం పార్టీ అత్యంత బలోపేతంగా ఉందని రేవంత్రెడ్డి అన్నారు.
కేసీఆర్కు తమ తఢాఖా చూపించేందుకు ఖమ్మంనే వేదికగా చేసుకోనుంది కాంగ్రెస్. ఏ ఖమ్మంలోనైతే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ పెట్టిందో.. అదే ఖమ్మంలో కాంగ్రెస్ సైతం అంతకుమించి భారీ బహిరంగ సభ నిర్వహించి.. తమ బలం, బలగాన్ని ప్రదర్శించాలని డిసైడ్ అయింది. త్వరలో నిర్వహించనున్న ఖమ్మం సభ.. ఇక కేసీఆర్ పాలనకు వీడ్కోలు పలుకుతుందని కాంగ్రెస్ నేతలంతా ముక్తకంఠంతో తేల్చిచెప్పారు.