Telangana BJP latest news(Latest political news) : తెలంగాణ బీజేపీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. కమలం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి ముఖ్య నేతలు డుమ్మా కొట్టారు. 117 నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేయగా.. ఈటల రాజేందర్, రాజగోపాల్రెడ్డి, ఎంపీ సోయం బాపూరావ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
ఈటల, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో కొందరు నేతలు పాల్గొనక పోవడం పెద్ద విషయమేమీ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎవరి వీలును బట్టి వాళ్లు పాల్గొంటారని లైట్ తీసుకున్నారు.
9 ఏళ్ల మోదీ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరించాలన్నదే ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం లక్ష్యం. ఒక్కో కార్యకర్త పోలింగ్ బూత్లో 10 కుటుంబాల వద్దకు వెళ్లేలా కార్యాచరణ రూపొందించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చైతన్యపురి 173వ పోలింగ్ బూత్ పరిధిలోని ప్రజల వద్దకు వెళ్లారు. 9 ఏళ్ల మోదీ పాలనపై రూపొందించిన కరపత్రాలు పంపిణీ చేశారు.
తెలంగాణ బీజేపీలో కొద్దిరోజులుగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారు. ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించే విషయంలో కాషాయ పార్టీ అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు కాంగ్రెస్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాక్టివ్ అయ్యారు. దీంతో ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇక రాజగోపాల్రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్లోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈటలకు కాంగ్రెస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. మరి ఈ కీలక నేతలిద్దరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?