Revanth Reddy latest news(Telangana congress news today): తెలంగాణలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ లో చేరేందుకు చాలామంది నేతలు ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ భేటీ కావడం ఆసక్తిగా మారింది. ఇరువురు నేతలు పార్టీలో చేరికలపై చర్చించారు. కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
చేరికలపై ఎలాంటి విభేదాలు లేవని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చాలామంది పార్టీలో చేరతామని వస్తున్నారని తెలిపారు. వివాదాస్పదంగా చేరికలు ఉండవని స్పష్టంచేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డితో చర్చించిన తర్వాతే పార్టీలో నేతలను చేర్చుకుంటామన్నారు. రాహుల్ ను ప్రధాని చేయడమే తమ లక్ష్యమన్నారు.
రేవంత్ తాను కలిసి పనిచేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రేవంత్ తాను సోదురులుగా ఉంటామని తెలిపారు. ఆ తర్వాత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసానికి రేవంత్, కోమటిరెడ్డి వెళ్లారు. అక్కడే లంచ్ మీటింగ్ జరిగింది. జూపల్లిని కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి ఇందిరమ్మ రాజ్యం నెలకొల్పడమే లక్ష్యమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నియంతృత్వ పాలన సాగిస్తోందని జూపల్లి విమర్శించారు.