BJP news telangana(latest political news telangana): తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ కాషాయ పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో గురువారం అర్థరాత్రి వరకు ఆయన అనుచరులతో చర్చలు జరిపారు. కాంగ్రెస్లో చేరాలని వారు ఒత్తిడి తెచ్చారు. అయితే 15 రోజుల్లో నిర్ణయం తీసుకుందామని ఈటల వారికి సర్దిచెప్పారు.
ఇంకోవైపు కోమటి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీని వీడే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈటల, రాజగోపాల్రెడ్డి కలిసి కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో బీజేపీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఢిల్లీకి రావాలని పిలిచింది. శనివారం ఈటల, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
గురువారం పార్టీ చేపట్టిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో ఈటల పాల్గొనలేదు. అటు బండి సంజయ్ తోనూ కొంతకాలంగా వైరం నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈటల ఇక కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. మరి బీజేపీ పెద్దలు ఈటలను పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా ఆపగలరా..?
కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో బీజేపీని గట్టి దెబ్బకొట్టాయి. గతంలో కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమైన నేతలు వెనుకడుగు వేశారు. ఇన్నాళ్లూ పార్టీకి బలంగా ఉన్న నేతలు సైలెంట్ అయిపోయారు. కర్ణాటక ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడు వ్యవహరించేవారు. అధికారమే లక్ష్యమంటూ ప్రభుత్వంపై పోరాటాలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామంటూ ఛాలెంజ్ లు చేశారు. కానీ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. కాంగ్రెస్ లో జోష్ వచ్చింది. ఇక ఇప్పుడు గులాబీ పార్టీకి కాంగ్రెస్ నే ప్రధాన పోటీదారుగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ లోని అసంతృప్తి నేతలు హస్తం కండువాలు కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో బీఆర్ఎస్ లోనూ కలవరం మొదలైంది.