Telangana Formation Day Celebrations: అభివృద్ధి అంటే హైదరాబాద్ ఒక్కటే కాదని.. మారుమూల పల్లెలు అభివృద్ధి చెందితేనే.. తెలంగాణకు నిజమైన ప్రగతి అని గవర్నర్ తమిళిసై అన్నారు. తెలంగాణ దశాబ్ది అవతరణ వేడుకలను రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తమిళిసై కేక్ కట్ చేశారు. నియామకాలు కొందరికే కాకుండా.. అందరికీ అందితేనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరినట్లు అని అన్నారు.
తెలంగాణలో కేసీఆర్ మాఫియా కొనసాగుతోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. పదేళ్లలో తెలంగాణను అప్పులపాలు చేశారని అన్నారు. కుటుంబపాలన పోయి.. తెలంగాణలో నీతివంతమైన పాలన రావాల్సి ఉందని అన్నారు. అమరుల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాల్సిఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గోల్కొండ కోట వేదికగా జరిగిన తెలంగాణ అవతరణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కిషన్రెడ్డి.. జెండాను ఆవిష్కరించారు. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం.. ఫోటో, పెయింటింగ్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు.
తెలంగాణలో మూర్ఖత్వపు పాలన కొనసాగుతుందని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురు తప్ప.. ఎవరూ కనిపించరని అన్నారు. బాధాతప్త హృదయంతో ఆవిర్భావ వేడుక జరుపుతున్నామని అన్నారు. రాష్ట్రంలో BRS.. కాంగ్రెస్ను లేపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మోదీ సర్కారే తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతోందని చెప్పారు. కేసీఆర్ హామీలిచ్చి అవి నెరవేర్చకుండా.. ప్రజలను మోసం చేశాడన్నారు బండి సంజయ్.
అటు, ఓయూలో నల్ల బెలూన్లతో విద్యార్థుల నిరసన వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాలను బహిష్కరించారు. ఉద్యోగాలు కల్పించలేని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.