Revanth Reddy Latest News(Political news in telangana): కర్ణాటక ఓటమితో కుంగిపోయిన బీజేపీని మళ్లీ లేవకుండా దెబ్బతీసేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే లూస్ అయిన బీజేపీ నట్లు, బోల్ట్లను పూర్తిగా పెకిలించేలా మాస్టర్ ప్లాన్ను అమలు చేయబోతున్నారు రేవంత్.
ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి.. అధికార బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్కు షాక్ ఇద్దామనుకున్న బీజేపీ పప్పులు ఉడికే పరిస్థితి కనిపించడంలేదు. కర్ణాటక ఎన్నికల గెలుపుతో ఫుల్ జోష్లో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీలో ఆపరేషన్ ఆకర్ష్ ఇంచార్జినే ఆకర్షించే పనిలో బిజీగా ఉంది. కర్ణాటక ప్రజలు కొట్టిన దెబ్బకు బీజేపీ నేతలు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. కర్ణాటక ఫలితాలపై గంపెడు ఆశలు పెట్టుకున్న తెలంగాణ బీజేపీ నేతలు.. ఇప్పుడు కర్ణాటక పేరేత్తే ధైర్యం కూడా చేయడం లేదు. ఇదే సమయంలో ఫుల్ జోష్లో ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కమలం పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న వారందరికీ స్నేహహస్తం ఇచ్చే పనిలో పడ్డారు.
బీజేపీలో చేరిన నేతలందరూ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చేయాలంటున్నారు టీపీసీసీ చీఫ్. ఇప్పటికే పార్టీ కోసం ఒక్క మెట్టు కాదు.. పది మెట్లు దిగుతానని ప్రకటించిన రేవంత్ రెడ్డి… మరోసారి బీజేపీ నేతలను పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్, బీజేపీ అవిభక్త కవలలని చెబుతున్నారు ఆయన. కేసీఆర్ను గద్దె దించేందుకు బీజేపీలో చేరిన నేతలందరు ఇప్పటికైనా కళ్లు తెరవాలన్నారు. నేతలందరి లక్ష్యం బీఆర్ఎస్ను ఓడించడమే అయినప్పుడు.. బీజేపీలో ఉండటమేందుకు.. కాంగ్రెస్లో చేరాలని ఆహ్వానిస్తున్నారు.
వలస నేతలకు బీఫామ్లు తప్ప.. కీలక పదవులు దక్కవనేది బహిరంగ రహస్యమనే టాక్ ఉంది. కేవలం మొదటి నుంచి ఉన్న నేతలు.. RSS నుంచి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యం ఇస్తారన్న చర్చ కూడా ఉంది. దీనినే ఇప్పుడు రేవంత్ తన ఆయుధంగా మలుచుకుంటున్నారు. అందుకే బీజేపీలో చేరికలకు ఇంఛార్జ్గా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్నే నేరుగా టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. బీజేపీలో ఇతర పార్టీల నుంచి వెళ్లిన నేతలు ఎదగలేరని.. ఇప్పటికైనా కాషాయ కండువాను పక్కన పెట్టి.. కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని కోరుతున్నారు. అంతేకాదు కాంగ్రెస్ను వదిలి వెళ్లిన వారంతా.. తిరిగి రావాలని ఆహ్వానిస్తున్నారు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. జూపల్లి కృష్ణారావులను కూడా పార్టీలో చేరాలని కోరారు.
ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలకూడదనేది రేవంత్ రెడ్డి లక్ష్యంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజలు వేసే ఓట్లు.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీలిపోతే.. ఎక్కువగా లాభపడేది అధికార బీఆర్ఎస్ పార్టీనే. ఈ విషయం తెలిసే బీజేపీ.. బీఆర్ఎస్తో వైరం ఉన్నట్టు నటిస్తోందనేది ఆయన వాదన.అందుకే అది ఎట్టకేలకు జరగకూడదని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. అందుకే బీజేపీలోని కీలక నేతలను తమ పార్టీ వైపు ఆకర్షించే పనిలో బీజీగా ఉన్నారు.
తెలంగాణలో కేసీఆర్కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాల్సి ఉందంటున్నారు రేవంత్ రెడ్డి. ఈ వ్యాఖ్యలపైనే ఇప్పటికే కమలనాథుల్లో హాట్ డిబేట్ మొదలయ్యింది. గౌరవం లేని పార్టీలోనే ఉండాలా.. గౌరవం అందిస్తామంటున్న పార్టీవైపు అడుగులు వేయాలా అన్న ఆలోచనలో చాలామంది పడ్డట్లు తెలుస్తోంది.