Bandi Sanjay latest news(Political news in telangana): ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన బండి సంజయ్. ఎందుకు వెళ్లారు? ఇప్పుడు ఇదే రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ, వారం రోజులుగా బండి సంజయ్ని కేబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం..! ఇదంతా నిజం కాబోతుందా? రాష్ట్ర బీజేపీలో పెను మార్పులు జరగబోతున్నాయా అన్నది ఉత్కంఠగా మారింది.
వరంగల్ లో ప్రధాని మోడీ రాక సందర్భంగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం అనంతరం కరీంనగర్ చేరుకోవల్సిన సంజయ్ అనూహ్యంగా హైదరాబాద్ వచ్చారు. ఉదయం ఢిల్లీ నుండి సంజయ్ కి ఫోన్ రాగానే ఆయన ఫ్లైట్ లో బయలుదేరి వెళ్లారు. అధికారిక వ్యవహారాలకైతే పీఎంఓ నుండి సంజయ్ కి పిలుపు వచ్చేది కానీ పార్టీ చీఫ్ నుండి కాల్ రావడంతో ట్విస్ట్ చోటు చేసుకుందా అన్న చర్చ మొదలైంది.
హన్మకొండలో జరిగే మోదీ సభకు తాను బీజేపీ అధ్యక్షుడి హోదాలో వస్తానో రానో అంటూ భావోద్వేగానికి గురయ్యారు బండి సంజయ్. తాను అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణ బీజేపీ విస్తరించిందని.. ఆయన పోరాటాల వల్లే పటిష్టమైందని కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్ణయమే తనకు శిరోదార్యమని.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమేనన్నారు. బిజెపికి త్యాగాల చరిత్ర ఉందన్నారు బండి సంజయ్. కార్యకర్తలెందరో జైలు పాలయ్యారని గుర్తు చేశారు.
ఎప్పటి నుంచో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారంటూ ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ను తప్పించి ఆయన స్థానంలో కిషన్రెడ్డికి పగ్గాలు ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది.