Telangana BJP latest news(Telugu news headlines today): కొన్నిరోజులుగా ఒక్కటే టాక్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేస్తారని ప్రచారం. బండి, ఈటల.. ఇద్దరిలో ఎవరు ఢిల్లీ వెళ్లినా.. అదిగో మార్చేస్తున్నారంటూ న్యూస్. ఇన్నాళ్లు బండి నిర్వహించిన బాధ్యతలకు గుర్తింపుగా.. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెబుతున్నారు. ఇప్పటికే సెంట్రల్ కేబినెట్లో ఉన్న కిషన్రెడ్డికి రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. ఈ మార్పుచేర్పుల్లో కీరోల్ ప్లే చేస్తున్న ఈటల రాజేందర్కు.. ఎన్నికల వేళ కీలకమైన ప్రచార కమిటీ పగ్గాలు కట్టబెడుతారని తెలుస్తోంది.
ఇంతకీ బండి మార్పు మంచిదేనా? అనే చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. బండి సంజయ్ హయాంలోనే బీజేపీ జవసత్వాలు పుంజుకుందని అంటున్నారు. బండి ఫెయిల్యూర్స్ ఏమున్నాయని ఆయన్ను మారుస్తారని ప్రశ్నిస్తున్నారు. కేవలం పార్టీలో గ్రూపులు పెరిగినందుకే.. కీలక సమయంలో.. కీలక పదవిలో.. మార్పులు చేర్పులు చేసే సాహసం చేస్తారా? అనే అనుమానమూ వ్యక్తం అవుతోంది. బండి నాయకత్వాన్ని పలు సందర్భాల్లో ప్రధాని మోదీతో సహా అనేక మంది జాతీయ నేతలు కొనియాడారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభను చూసి.. శభాష్ అని బండి భుజం తట్టారు మోదీ. షా, నడ్డాలు సైతం సంజయ్ను మెచ్చుకున్నారు. కార్యకర్తల్లోనూ మునుపెన్నడూ లేనంత ఉత్సాహం నింపింది బండి సంజయే. కేసీఆర్ కుటుంబంపై పదునైన విమర్శలతో, హిందుత్వ నినాదంతో, సుధీర్ఘ పాదయాత్రలతో తెలంగాణలో కమలోత్సాహం తీసుకొచ్చారు. అలాంటి బండిని.. పార్టీ అధ్యక్ష పదవి నుంచి అర్థాంతరంగా తీసేస్తే..? బీజేపీకి లాభమేనా? అధిష్టానం నిర్ణయం సరైనదేనా?
ఇక కొత్త అధ్యక్షుడిగా కిషన్రెడ్డి పేరు వినిపిస్తోంది. ఇది మరింత సాహసోపేత నిర్ణయం. కిషన్రెడ్డి గతంలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. అప్పుడు ఏమంత ప్రభావం చూపించారు? పార్టీని ఏ మేరకు బలోపేతం చేశారు? అనే పోస్ట్మార్టం జరుగుతోంది. బండి సంజయ్ పక్కా మాస్. కిషన్రెడ్డి కంప్లీట్ క్లాస్. బండి భాష ముందు ఆయన తేలిపోతారు. కేసీఆర్ ఫ్యామిలీపై బండి తరహాలో మాటల దాడి చేయలేరు. కేసీఆర్తో ఫ్రెండ్లీ మ్యాచే ఆడుతారనే విమర్శ కూడా ఉంది. కిషన్రెడ్డి డైలాగులు సైతం బండి తరహాలో డైనమైట్లలా పేలవు. ఇలా ఆ ఇద్దరి నాయకత్వాల మధ్య అంత వ్యత్యాసం ఉంటే.. హైకమాండ్ అదేమీ పట్టించుకోకుండా.. ఈటల మాటలు విని.. బండి సంజయ్ను తప్పిస్తుందనే వార్తల్లో అసలేమాత్రం నిజం లేక పోవచ్చని అంటున్నారు. పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్చుగ్ సైతం.. అధ్యక్ష మార్పు ఉండదని పదే పదే చెబుతున్నారు. అయినా, మీడియాలో బ్రేకింగ్స్తో గాసిప్ న్యూస్ ఆగడం లేదని మండిపడుతున్నారు కమలనాథులు. ఈ ప్రచారం వెనుకా.. ప్రత్యర్థి పార్టీల కుట్ర ఉందని మండిపడుతున్నారు.