Ponguleti Srinivas Reddy joins Congress(Khammam meeting news): ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభకు అధికార బీఆర్ఎస్.. అనేక ఆటంకాలు కల్పించింది. అయినా, జన ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. లక్షలాది జనం.. ప్రభంజనంగా తరలివచ్చారు. ఇంతకీ, ఖమ్మం సభపై బీఆర్ఎస్ ఎందుకంత కక్ష పూరితంగా వ్యవహరించింది?
ఖమ్మం సభ రాజకీయంగా గేమ్ ఛేంజర్ కానుందనే వాదనలు వినిపిస్తున్నాయి. పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఆ పార్టీకి తిరుగుండదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటోంది. కమ్యూనిస్టుల ప్రభావం తగ్గిపోయాక ఇక్కడ దాదాపు అన్ని స్థానాల్లోనూ హస్తం పార్టీ జయకేతనం ఎగురవేయడం పరిపాటిగా వస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో ఏడుగురు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. భట్టి విక్రమార్క, పొదెం వీరయ్య మినహా మిగతా ఐదుగురు బీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య. మచ్చా నాగేశ్వర్రావు కూడా బీఆర్ఎస్ గూటికి చేరారు. ఎంపీ స్థానంలో నామా నాగేశ్వరరావు విజయం సాధించగా.. దాని వెనకాల తన కృషి ఉందని పొంగులేటి బహిరంగంగానే ప్రకటించారు.
2014లోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ మంచి ఫలితాలనే రాబట్టింది. అక్కడ నాలుగు స్థానాల్లో హస్తం పార్టీ విజయం సాధించింది. మూడు స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అలాగే వైసీపీ నుంచి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి ప్రభావంతో అక్కడ వైసీపీ సత్తా చాటిందనేది రాజకీయ విశ్లేషకుల మాట. టీడీపీ, బీఆర్ఎస్ కేవలం ఒక్కస్థానంతోనే సరిపెట్టుకున్నాయి. సీపీఎం ఒకచోట గెలిచింది. తాజాగా పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్లోకి రావడం గులాబీ పార్టీకి గుబులు రేపుతోందనే చర్చ జరుగుతోంది. పొంగులేటి ప్రభావం.. భట్టి విక్రమార్క వంటి అగ్రనేతలు.. రేవంత్ రెడ్డి వ్యూహాలు.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు సానుకూల పవనాలు వీస్తుండటం బీఆర్ఎస్కు భయం పట్టుకుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా సహా జూపల్లి చేరికతో మహబూబ్నగర్లోనూ కాంగ్రెస్ పార్టీకి మరింత ప్లస్ కానుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లాల్లో హస్తం పార్టీకి మంచి పట్టుంది. ఇప్పటికే వరంగల్ సభకు రాహుల్ హాజరవగా రైతు డిక్లరేషన్కు మంచి స్పందన వచ్చిందని హస్తం పార్టీ భావిస్తోంది. అలాగే సరూర్ నగర్ నిరుద్యోగ గర్జన సభకు ప్రియాంక గాంధీ హాజరవగా యూత్లో కొత్త జోష్ వచ్చిందని అంచనా వేస్తోంది. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అంశాలు కాంగ్రెస్కు పాజిటివ్ టాక్ తెచ్చాయి, గ్రూప్1 సహా TSPSC ఎగ్జామ్స్ పేపర్ లీక్ అంశాలతో ప్రభుత్వంపై నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. ఇవన్నీ తమకు కలిసి రానున్నాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అలాగే పీసీసీ చీప్ రేవంత్రెడ్డి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్లోని అసెంబ్లీ స్థానాలపైనా ఉంటుందని హస్తం వర్గాలు ధీమాగా ఉన్నాయి.
పొంగులేటి, జూపల్లి వంటి నేతలను ఆకర్షించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆ ఇద్దరు ముఖ్యనేతల్ని కాంగ్రెస్లోకి రప్పించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. తాజాగా ఖమ్మంలో భారీ సభ నిర్వహించడం బీఆర్ఎస్కు మింగుడుపడటం లేదని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. పొంగులేటిని బీఆర్ఎస్ అధిష్టానం తక్కువ అంచనా వేసిందనే వాదనలు ఉన్నాయి. అతను కాంగ్రెస్లో చేరడం ఉమ్మడి ఖమ్మం జిల్లాను ప్రభావితం చేస్తుందనే ఆందోళన.. ఇప్పడు గులాబీ నేతల్లో కనిపిస్తోందని హాట్ టాపిక్ అయింది.
మరోవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు పీక్స్లో ఉందనేది ఎప్పటినుంచో రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ. తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్, సండ్ర వెంకట వీరయ్యతో పాటు మిగతా నేతలు ఎవరికి వారే అనేలా వ్యవహహిస్తున్నారనే టాక్ ఉంది. పలుమార్లు ఈ పంచాయితీలు ప్రగతి భవన్కు చేరాయి. అయినా వర్గపోరు అలాగే కొనసాగుతోందనే వాదనలు ఉన్నాయి. తాజాగా పొంగులేటి కాంగ్రెస్లో చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అంతంత మాత్రంగానే ఉన్న బీఆర్ఎస్కు రానున్న ఎన్నికలు గట్టి షాక్ను ఇవ్వడం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.