Patnam Mahender reddy news(TS politics) : తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు. అధికార బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు చాలా మంది నాయకులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ బహిష్కత నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఇద్దరూ కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం ఇక లాంఛనమే.
మరికొందరు ఫేమ్ ఉన్న లీడర్స్ కారు దిగేందుకు రెడీగా ఉన్నారు. మాజీ మంత్రి , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరతారని వార్తలు వస్తున్నాయి. ఆయన త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. తాండూరు నియోజకవర్గంలో పట్నం మహేందర్ రెడ్డి బలమైన నేతగా ఉన్నారు.
1994,99 ఎన్నికల్లో టీడీపీ నుంచి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో ఓటమిపాలైనా తిరిగి 2009 ఎన్నికల్లో మళ్లీ గెలిచారు. 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. కానీ 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. పట్నంపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆ తర్వాత గులాబీగూటికి చేరారు.
పట్నం, పైలెట్ రోహిత్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ ఎప్పటి నుంచో నడుస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం రోహిత్ రెడ్డికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మహేందర్రెడ్డి కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. నియోజకవర్గంలో రోహిత్ రెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడంపై మండిపడుతున్నారు. అందుకే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.
మహేందర్రెడ్డి సోదరుడు కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేందర్ రెడ్డి కుటుంబం బీఆర్ఎస్ ను వీడతారన్న ప్రచారంతో పార్టీలో కలకలం రేపుతోంది.