Congress News Telangana(ts politics) : ఒకప్పుడు కాంగ్రెస్ ఎట్లుండేది? మన్నుతిన్న పాములా సోదిలో కూడా లేకుండా పడుండేది. మరి, ఇప్పటి కాంగ్రెస్? పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ఎట్లుంది? కేసీఆర్ సర్కారుపై బుసలు కొడుతోంది. రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోంది. కాంగ్రెస్ దూకుడుతో కారు జోరుకు బ్రేకులు పడ్డాయి. పువ్వు గుర్తు వాడిపోతోంది. గడిచిన నాలుగేళ్లుగా స్థబ్దుగా ఉన్న హస్తం పార్టీ.. ఇప్పుడు వరుస సభలు, పాదయాత్రలతో కేక పెట్టిస్తోంది. గులాబీ దళంలో కాక రేపుతోంది. ఇన్నాళ్లు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకే చేరికలు ఉండేవి. ఇప్పుడు కారు నుంచి కాంగ్రెస్లోకి వలసలు మొదలయ్యాయి. అవి రోజు రోజుకూ మరింత పెరుగుతున్నాయి. చేరికలు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు? రాబోయేది కాంగ్రెస్ సర్కారేనా? ఆ సిగ్నల్ అదేనా?
పొంగులేటి, జూపల్లిల కోసం కమలనాథులు ఎంతగా ప్రయత్నం చేశారో. దండుగా పొంగులేటి ఇంటికెళ్లి మరీ బతిమిలాడుకున్నారు. ఆ తర్వాత ఫామ్హౌజ్లో ఈటల మరింత వేడుకున్నారు. అయినా, వాళ్లిద్దరూ కాంగ్రెస్కే జై కొడుతున్నారంటే అర్థం ఏంటి? స్వతహాగా కాంట్రాక్టర్ అయిన పొంగులేటి.. కేంద్రంలోని బీజేపీ నుంచి ఎన్ని హామీలు వచ్చినా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిలా.. బెండ్ అవలేదంటే రీజన్ ఏంటి? ఈసారి తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అనే నమ్మకమేగా.
అటు, జూపల్లి కోసం ఇప్పటికీ తెగ ట్రై చేస్తున్నారు కమలనాథులు. ఆయన సైతం బీజేపీలో చేరేందుకు ససేమిరా అంటూ.. కాంగ్రెస్ కండువ కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. పొంగులేటి, జూపల్లిలే కాదు. లేటెస్ట్గా కేసీఆర్కు సన్నిహితుడైన నిర్మల్లో బలమైన నేత శ్రీహరిరావు కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచకళ్ల దామోదర్రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి సైతం కాంగ్రెస్లో చేరబోతున్నారు. ఇలా ఎంపీ, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే స్థాయి బడా నేతలు.. వరుసబెట్టి క్యూ కడుతుండటం.. తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తోందనడానికి నిదర్శనం..అంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి ఇంటికెళ్లి మరీ కాంగ్రెస్లో చేరాలని ఇన్వైట్ చేశారు రేవంత్రెడ్డి. పీసీసీ చీఫే తన ఇంటికొచ్చి అడిగేసరికి కాదనలేకపోయారు. ఈ నెల 18న గాంధీభవన్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు గుర్నాథ్రెడ్డి. అటు, ఈ నెల 22 తర్వాత.. పొంగులేటి, జూపల్లి, కూచకళ్ల దామోదర్రెడ్డిలు రాహుల్ గాంధీతో భేటీ అవుతారని.. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరుతారని తెలుస్తోంది.
మరోవైపు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ లీడర్, లాయర్.. గంగాపురం రాజేందర్, మాజీ జడ్పీటీసీ భీముడు నాయక్, అచ్చంపేట, చారగొండ మండలాలకు చెందిన గులాబీ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్లో చేరికలు గాలివాటంతో కూడినవి కావన్నారు పీసీసీ చీఫ్. ఈ చేరికలు రాష్ట్రాన్ని కేసీఆర్ నుంచి విముక్తి కలిగించేందుకు.. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరికలు తెలంగాణ ప్రజల చైతన్యానికి ప్రతీక అన్నారు. కేసీఆర్ అరాచక పాలనను భరించే ఓపిక ఇక ప్రజలకు లేదని.. రాష్ట్రాన్ని పాలించే అర్హత కేసీఆర్కు లేదన్నారు రేవంత్రెడ్డి.
తెలంగాణలో గెలిచేది, నిలిచేది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని మంత్రులు కేటీఆర్, హరిష్ రావు అంటున్నారని.. కేటీఆర్ అమెరికాలో ఉన్నప్పుడు తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడిందని గుర్తు చేశారు. గెలిస్తే ఆ క్రెడిట్ కేసీఆర్ కు.. ఓడితే ఆ బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలని సీఎం చెబుతున్నారని.. ఎమ్మెల్యేలు ఇప్పటికైనా వాస్తవాన్ని గుర్తించాలన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ వేడుకలను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని.. గెలుపు జోస్యం చెప్పారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.