Telangana congress latest news(TS political news today) : తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా అంటున్నారు టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి. అధికారంలోకి రాగానే అమలు చేయబోయే హామీలను ఆయన ఒక్కొక్కటిగా చెబుతూ వస్తున్నారు. ఇదే బాటలో మరో కీలక హామీని ఇచ్చారు రేవంత్.
తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని మరోసారి చెప్పారు. కాంగ్రెస్ పథకాలను… సీఎం కేసీఆర్ కాపీకొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకునే పేదలకు రూ. 5 లక్షల సాయంతో పాటు ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అదే విధంగా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తామని రేవంత్ వ్యాఖ్యానించారు. వీటితో పాటు.. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు కారణమైన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ హామీని తెలంగాణలో కూడా అమలు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.
సీఎం కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితేనే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్నారు రేవంత్రెడ్డి. అధికారంలోకి రాగానే కర్ణాటకలో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ అమలు చేస్తోందన్న ఆయన రాష్ట్రంలోనూ పార్టీ అధికారంలోకి రాగానే ఇస్తున్న హామీలన్నీ అమలు చేస్తామని మాటిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ను గెలిపించి సోనియాకు కానుక ఇద్దామని ఈ సందర్భంగా రేవంత్ పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్, షాద్నగర్, ఉప్పల్ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ నేతలను రేవంత్రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్కు బీఆర్ఎస్ చేసిందేమి లేదన్న రేవంత్ జిల్లాను కాంగ్రెస్ దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జోగు రామన్నపై తీవ్ర విమర్శలు చేశారు. జోగు రామన్న చెల్లని రూపాయని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్న రేవంత్… అందుకే ఆయనకు మళ్లీ మంత్రి పదవి ఇవ్వవలేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మరోసారి సీఎం కేసీఆర్ను ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరని.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెసే అన్నారు రేవంత్ రెడ్డి.