Revanth Reddy latest speech(Telangana politics): కేసీఆర్ సన్నిహితుడు, ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన బీఆర్ఎస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యకుడు కూచాడి శ్రీహరిరావు కాంగ్రెస్లో చేరారు. గాంధీభవన్లో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్రెడ్డి. శ్రీహరిరావుకు పీసీసీ చీఫ్ అండగా ఉంటానని.. నిర్మల్లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని అన్నారు. పార్టీ గెలుపు కోసం పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందన్న భరోసా ఇచ్చారు రేవంత్రెడ్డి.
నిర్మల్ ఎమ్మెల్యే, మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తరఫున సవాల్ విసిరారు రేవంత్రెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిన సెగ్మెంట్లలోనే బీఆర్ఎస్ ఓట్లు అడగాలని.. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో తాము ఓట్లు అడుగుతామని.. ఈ ఛాలెంజ్కు ఇంద్రకరణ్రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. పార్టీ నుంచి కొందరు వెళ్లిపోయినా.. అంతకుమించిన నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారని పరోక్షంగా ఏలేటిని ఉద్దేశించి కామెంట్ చేశారు రేవంత్. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ప్రేమ ఉందని.. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతగా ఎన్నికల్లో గెలిపించాలని పిలుపిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10కి కనీసం 8 సీట్లు గెలిపించుకోవాలని.. తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం, ఒక తుపాన్ రాబోతోందని అన్నారు రేవంత్రెడ్డి.
కాంగ్రెస్లో చేరిన శ్రీహరిరావు.. నిర్మల్ నియోజకవర్గం నుంచి 2009, 2014లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీలో నకిలీ ఉద్యమ నాయకులు పదవులు అనుభవిస్తుండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కొన్నాళ్లుగా బీఆర్ఎస్పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.