Kishan Reddy Latest News(Telangana BJP news today): తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మారుస్తారని కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది. బండి సంజయ్ ను ఆ పదవి నుంచి తప్పిస్తారని వార్తలు వచ్చాయి. బండిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారని ఊహాగానాలు వెలువడ్డాయి. తెలంగాణ నేతల వరుస ఢిల్లీ పర్యటనలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఈటల రాజేందర్ తొలుత ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. ఆ తర్వాత బండి సంజయ్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వ్యక్తిగత పనులంటూ బండి సంజయ్ చెప్పుకున్నారు. కానీ పార్టీలో ఏదో జరగబోతుందని జోరుగా చర్చ జరిగింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు అసలు అవకాశమే లేదని స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలకు చెక్ పెట్టారు. తెలంగాణకు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలను కలవడం సహజమని తెలిపారు. ఢిల్లీ వెళ్లినంత మాత్రాన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మారుస్తున్నట్లు కాదన్నారు. దీంతో కొన్ని రోజులుగా నడుస్తున్న చర్చకు తెరపడింది.
ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఉండదని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్కు తెలంగాణలో భవిష్యత్ లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ వ్యవహారంపైనా కిషన్ రెడ్డి స్పందించారు. అది కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ పరిధిలోని అంశమన్నారు. ఆధారాలు ఉండటం వల్లే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసిందని తెలిపారు.