Etela Rajender latest news(Political news today telangana): ఈటల రాజేందర్. బీఆర్ఎస్లో ఉన్నన్నాళ్లూ కేసీఆర్ చాటు లీడర్. ఉద్యమ సమయంలో మంచి గుర్తింపే ఉన్నా.. అధికారంలోకి వచ్చాక.. గులాబీ బాస్ నీడలో పరపతి తగ్గిపోయింది. అందరిలానే.. ఓ ఎమ్మెల్యేగా, మంత్రిగా పడుండేవారు. ఎప్పుడైతే దొరతనాన్ని ధిక్కరించారో.. పార్టీని వీడి బీజేపీలో చేరారో.. అప్పటి నుంచీ మళ్లీ ఈటల రాజేందర్ టాక్ ఆఫ్ ది తెలంగాణ అయ్యారు. మునుపటి పదునైన ఈటల కనిపిస్తున్నారు.
ఏదో పార్టీలో చేరామా.. ఎమ్మెల్యేగా గెలిచామా.. సర్దుకున్నామా.. అనే టైప్ కాదాయన. ప్రగతిభవన్ గోడలు కూల్చడమే ఈటల టార్గెట్. అందుకోసం.. ఎందాకైనా అనే రకం. హుజురాబాద్లో హోరాహోరీ పోరాడారు. అధికారపార్టీ బలం, బలగానికి ఎదురునిలిచి గెలిచారు. ఫస్ట్ టార్గెట్ అచీవ్డ్.
కేసీఆర్ను దెబ్బకొట్టగల సత్తా ఉన్న పార్టీ బీజేపీనే అని బలంగా నమ్మారు. అధిష్టానానికీ ఆ నమ్మకం కలిగించారు. ప్రచార కమిటీ పగ్గాలు చేపట్టారు. బూర నర్సయ్య గౌడ్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఏలేటి మహేశ్వర్రెడ్డి తదితరులను పార్టీలో చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. అక్కడితో ఆగలేదు. దిల్ మాంగే మోర్ అంటూ మరిన్ని ఆపరేషన్ ఆకర్ష్లు చేపట్టారు. అయితే, చివరి నిమిషంలో అవన్నీ ఫెయిల్ అయ్యేవి. అందుకే, బీజేపీలో కేసీఆర్ కోవర్ట్లు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్తో జరుగుతున్న కోల్డ్వార్ ఓపెన్ సీక్రెట్. ఈటల.. ఖమ్మం వెళ్లి పొంగులేటి,జూపల్లిలతో మాట్లాడారు. ఆ విషయం తనకు తెలీదంటూ బండి ఓపెన్గానే బాంబ్ వేశారు. వారికి వారికే అండర్స్టాండింగ్ లేదు.. ఇలాగైతే ఎలాగంటూ.. పార్టీలో చేరాలని అనుకున్నవారుసైతం వెనకడుగు వేశారు. అంతా తేడాగా ఉందనుకున్న ఈటల.. డైరెక్ట్గా హైకమాండ్తోనే డీల్ స్టార్ట్ చేశారు. ఇతర పార్టీ నాయకులు తనను నమ్మాలంటే.. పార్టీలో చేరికలు జరగాలంటే.. తనకు ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు ఇవ్వాలని.. బండి సంజయ్ను ఆ స్థానం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈటల సత్తా గుర్తించిన అధిష్టానం.. అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజేందర్కు కీలక పదవి కట్టబెట్టింది.
సీఎం కేసీఆర్ బలం, బలహీనతలపై అవగాహన ఉన్నోడిని కాబట్టే.. పార్టీ తనపై విశ్వాసం ఉంచిందని ఈటల రాజేందర్ అన్నారు. పార్టీ కొత్త అధ్యక్షుడు కిషన్రెడ్డితో కలిసి పని చేస్తానని చెప్పారు. అయితే, కిషన్రెడ్డికి పార్టీ పదవితో పాటు కేంద్రమంత్రి పదవి సైతం అలానే ఉంది. ఫుల్ టైమ్ రాష్ట్ర పార్టీ కోసం టైమ్ కేటాయించడం కష్టమైన పనే. పేరుకు కిషన్రెడ్డే బాస్ అయినా.. పవర్ అంతా ఈటల చేతిలో పెట్టారని అంటున్నారు. ఆమేరకు ఢిల్లీ నుంచి క్లియర్ డైరెక్షన్ వచ్చిందని చెబుతున్నారు. ఇకపై తెలంగాణ బీజేపీలో రాజేందరే కింగ్ మేకర్ కానున్నారని తెలుస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే.. కింగ్ కూడా ఈటలనే అంటున్నారు. కేసీఆర్కు ధీటైన నేతగా.. ఉద్యమ నాయకుడైన ఈటల రాజేందర్నే సీఎం కేండిడేట్గా బీజేపీ ప్రొజెక్ట్ చేయనుందని సమాచారం.