BJP news Telangana(Telugu flash news): బండి సంజయ్పై వేటు పడింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఊడిపోయింది. బండి అభిమానులు దిగాలుగా ఉన్నారు. విజయశాంతి లాంటి వాళ్లు ట్విటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. నిప్పులు కురిపించే నడక పార్టీకి నేర్పించారంటూ ప్రశంసించారు. నడ్డా సైతం బండి బాగా పని చేశారని కొనియాడారు. మరి, అంతబాగా పని చేస్తే ఎందుకు తీసేయాల్సి వచ్చిందనేది వేరే విషయం. ఇదంతా పక్కనపెడితే.. బండి సంజయ్ పోస్ట్ ఊస్ట్ అవడంతో.. ఓ ఇద్దరు బీజేపీ నేతలు మాత్రం తెగ ఖుషీ అవుతున్నారని అంటున్నారు. ఎప్పటినుంచో బండి నాయకత్వంపై రగిలిపోతున్న.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావులు.. సన్నిహితుల దగ్గర పండుగ చేసుకుంటున్నారట.
బండితో విభేదాల కారణంగా.. ఎంపీ అర్వింద్ చాలాకాలంగా హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో అడుగే పెట్టట్లేదు. బండి నాయకత్వాన్ని అంగీకరించనందువల్లే ఆయన పార్టీ ఆఫీసుకు రారు.. అక్కడ ప్రెస్మీట్లు పెట్టరని అంటారు. అలాంటిది.. మంగళవారం మధ్యాహ్నం బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తొలగించారంటూ ఢిల్లీ నుంచి న్యూస్ రాగానే.. కొన్నిగంటల గ్యాప్లోనే ధర్మపురి అర్వింద్ నాంపల్లి పార్టీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. అవసరం లేకున్నా.. మీడియా సమావేశం నిర్వహించి తాజా పరిణామాలపై స్పందించారు.
కిషన్రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. బీఆర్ఎస్ను ఓడగొట్టేందుకు అందరం కలిసికట్టుగా పనిచేస్తామని.. కిషన్రెడ్డి నాయకత్వాన్ని పార్టీలో అందరూ ఆహ్వానిస్తారని.. అర్వింద్ అన్నారు. కిషన్రెడ్డిది లక్కీ హ్యాండ్ అని కూడా చెప్పుకొచ్చారు. అంటే, కిషన్ ఈజ్ బెస్ట్.. బండి వాజ్ వేస్ట్.. అనేలా అర్వింద్ మాటలు, హావాభావాలు ఉన్నాయని అంటున్నారు.
ఇక, ఎమ్మెల్యే రఘునందన్రావు సైతం బండిపై చాన్నాళ్లుగా కత్తులు నూరుతున్నారు. తనకు ప్రయారిటీ ఇవ్వడం లేదని.. తాను ఎదగకుండా చెక్ పెడుతున్నారని భావిస్తున్నారు. అందుకే, బండికి దూరంగా.. కిషన్రెడ్డి, ఈటలకు దగ్గరగా ఉంటున్నారు. నాయకత్వ మార్పు వార్తలు రాగానే.. ఢిల్లీలో మకాం వేసి తాను సైతం రేసులో ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ పోస్టు, జాతీయ అధికార ప్రతినిధి.. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇవ్వాలంటూ అధిష్టానానికే ఆఫర్లు ఇచ్చారు. బండి సంజయ్ పదవి పోబోతోందని ముందుగా మీడియాకు క్లారిటీ ఇచ్చింది ఈయనే. ఈ సందర్భంలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ.. బండి సంజయ్పై ఉన్న అక్కసు అంతా వెళ్లగక్కారు. పుస్తెలమ్మి పోటీ చేశారని, వంద కోట్ల యాడ్స్ ఇచ్చారని.. తాను సొంతంగా గెలిచానని.. ఇలా బాగానే నోరు జారారు. అది కాస్త కాంట్రవర్సీ కావడంతో.. మళ్లీ మీడియా ముందుకు వచ్చి అంతా తూచ్ అన్నారు. ఇప్పుడు అనుకున్నట్టుగానే బండి సంజయ్ అధ్యక్ష పదవి పోవడంతో.. కాస్త రిలాక్స్డ్గా కనిపిస్తున్నారు. కిషన్రెడ్డికి శుభాకాంక్షలు చెప్పి.. ఫుల్ ఖుషీ అవుతున్నారు.