Nagoba jatara:- పుష్యమాసంలో వచ్చే అమావాస్యరోజున, గిరిజనులు నాగోబా జాతరను ఎంతో ఆనందంగా చేసుకుంటూ ఉంటారు. ఈ రోజు వారి ఆరాధ్య దైవమైన నాగోబా పురివిప్పి నాట్యంచేస్తాడని నమ్మకం.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా ఆలయం ఉంది. పక్కరాష్ట్రాలనుంచీ లక్షలాదిమంది గిరిజనులు ఈగ్రామానికి చేరుకుని నాగోబా జాతరలో పాల్గొంటారు. ఈ జాతరకు వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ జాతరకు 16 రోజుల ముందు అంటే పుష్యమాస పౌర్ణమికి ఒకరోజు ముందు కొంతమంది గిరిజనులు పవిత్ర నాగోబా ఆలయం నుంచి కలశం తీసుకుని గోదావరి జలం తేవటానికి కాలినడకన బయలుదేరి దేరతారు.
కేస్లాపూర్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నకలమడుకు వరకు నడిచి వెళ్ళి గోదావరి జలం తీసుకు వస్తారు. ఇక్కడ గిరిజనుల పూర్వులు స్నానం చేస్తుండగా నాగదేవత దర్శనమిచ్చిందనే నమ్మకంతో అక్కడి జలాన్ని పవిత్రంగా గిరిజనులు విశ్వసిస్తుంటారు. ఈ ప్రాంతం నుంచి సేకరించిన జలంతో నిండిన కలశాన్ని నలభై కిలోమీటర్ల దూరంలోని ప్రధాన పూజారి ఉండే గుంజాల గ్రామానికి తెచ్చి అక్కడ ఒకరోజు ఉన్న తరువాత కేస్లాపూర్కు 8కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లికి తీసుకెళ్లి ఇంద్రాదేవిని సామూహికంగా పూజలు నిర్వహిస్తుంటారు.
ఇంద్రవెల్లి నుంచి బయలుదేరి కేస్లాపూర్ చేరి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మర్రిచెట్టు కింద 4 రాత్రులు, ఒక పాకలో 3 రాత్రులు సామూహిక పూజలు జరిపి కేస్లాపూర్ మందిరానికి వాయిద్యాలతో ఊరేగిస్తూ తెచ్చి ఆలయం వద్ద ఉన్న మర్రిచెట్టుపై పవిత్ర జలకలశం భద్రపరిచి 10కి.మీ. దూరంలోని సిరికొండ చేరుకుంటారు. పుష్య అమావాస్య రోజున కలశం ఉంచిన మర్రిచెట్టు దగ్గర పుట్టను తయారు చేసి ఆలయం పక్కన పూజామందిరాన్ని మట్టితో అలికి అమావాస్య అర్థరాత్రి కలశంలో ఉన్న జలంతో ఆలయంలో ఉన్న నాగ దేవతను అభిషేకిస్తారు. గిరిజన తెగకు చెందిన మెస్రిం వంశస్తులు దేశంలో ఏ మారుమూల ఉన్నా తప్పనిసరిగా ఈ జాతరకు హాజరవడం ముఖ్యంగా భావిస్తుంటారు.
Follow this link for more updates:- Bigtv