Anam ramanarayana reddy news(AP political news) : నెల్లూరు జిల్లాలో పొలిటికల్ ఇక్వేషన్స్ వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు అదే జిల్లాలో వైసీపీకి షాక్ మీద షాక్ తగుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానంలో వైసీపీ ఓడిపోయిన తర్వాత జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు పడింది. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ముగ్గురు నేతలు సైకిల్ ఎక్కడం దాదాపు ఖాయమైపోయింది.
ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చేరతారనే చర్చ చాలారోజులుగా సాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు. శ్రీధర్ రెడ్డి కూడా అదే బాటలో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇక సీనియర్ నేత ఆనం రాంనారాయణరెడ్డి శుక్రవారం రాత్రి హైదరాబాద్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ఆసక్తిగా మారింది. దాదాపు గంటపాటు ఇరువురు మధ్య చర్చలు జరిగాయి. నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించారని తెలుస్తోంది.
చంద్రబాబుతో భేటీ తర్వాత ఆనం నెల్లూరుకు వచ్చేశారు. ఇక్కడ మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఆనంతో సమావేశమయ్యారు. ఆయన ఇంట్లో అల్పాహార విందు ఇచ్చారు. దీనికి జిల్లాలోని టీడీపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
వెంకటగిరి, నెల్లూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని తన అనుచరులతో ఆనం ఆదివారం భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ నెల 12న నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. జిల్లాలో పాదయాత్ర పూర్తైన తర్వాత పార్టీలో చేరతానని ఆనం క్లారిటీ ఇచ్చారు. అమరావతి టీడీపీ కార్యాలయంలో సభ్యత్వం తీసుకుంటానని తెలిపారు.
మరోవైపు బద్వేల్లో లోకేశ్తో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చర్చలు జరిపారు. ఇటు నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డితోనూ టీడీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తంమీద వైసీపీ నుంచి సస్పెండ్ ముగ్గురు ఎమ్మెల్యేలు పసుపు కండువాలు కప్పుకోవడం ఇక లాంఛనమే. తాజా పరిణామాలతో ఉమ్మడి నెల్లూరు టీడీపీలో జోష్ వచ్చింది.