Nara Lokesh latest news(Political news in AP): 90వేల మెజారిటీతో గెలిపించినందుకు పులివెందులకు సీఎం జగన్ చేసింది ఏంటి? వైఎస్సార్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు రావడం తప్ప పులివెందుల నియోజకవర్గానికి జగన్ ఏం చేశారు? అంటూ నిలదీశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. పులివెందులకు నీళ్లు ఇచ్చింది.. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసింది.. తామేనన్నారు.
పులివెందులలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో లోకేశ్ సమావేశమయ్యారు. వైసీపీ పాలనలో విపరీతంగా పన్నులు పెంచి పీడిస్తున్నారని.. పులివెందుల ప్రజలు కూడా అందుకు బాధితులే అని విమర్శించారు. పులివెందులలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని.. స్కూళ్లలో కనీస వసతులు లేవని.. అదనంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని మండిపడ్డారు.
పులివెందుల టీడీపీ నాయకులకు దిశానిర్దేశం చేశారు లోకేశ్. పనిచేసే వారికే పదవులు ఇస్తామని.. కేసులకు భయపడి ఇంట్లోనే అంటే కుదరదని తేల్చి చెప్పారు. ఢీ అంటే ఢీ అనే వాళ్లనే గుర్తించి పార్టీ పదవులు కట్టబెడతామని అన్నారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి.. సర్వీస్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు నారా లోకేశ్.