Kesineni Nani : టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్చార్జ్లు ఎవరు గొట్టంగాళ్లు, ప్రజలే తనకు సుప్రీం అంటూ మాట్లాడటం టీడీపీలో కలకలం రేపింది. మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదన్నారు. రామ్మోహన్నాయుడికి తప్ప ఇతర ఎంపీలకు మాట్లాడే అవకాశమే లేదని మండిపడ్డారు. ఇటీవల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు పార్టీ కార్యాలయం ప్రారంభించినా తనను కనీసం ఆహ్వానించలేదన్నారు. తనకు ప్రజల మద్దతు ఉందని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేసే వాళ్లకు ఇతర పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయన్నారు.
వేరే పార్టీ ఆఫర్లు మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేశినేని నాని అన్నారు. తనకు 100 శాతం మండితే అపుడు దానిపై ఆలోచిస్తానని స్పష్టం చేశారు. అమిత్ షాతో చంద్రబాబు భేటీ ఎందుకో తనకు తెలియదన్నారు. చంద్రబాబు పీఏ ఫోన్ చేస్తేనే ఆ రోజు ఢిల్లీ వెళ్లానని కేశినేని వివరణ ఇచ్చారు.
మీడియా సంస్థలు సర్వే చేస్తే ఎవరి సత్తా ఏంటో బయటపడుతుందంటూ కేశినేని సవాల్ విసిరారు. ఇక తనకు అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలున్నాయన్నారు. ఇటీవల నందిగామ నియోజకవర్గంలో కేశినేని నాని పర్యటించారు. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావుతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే పనితీరును మొచ్చుకున్నారు. అభివృద్ధి కోసం ఏ పార్టీ నేతలతోనైనా కలిసి పనిచేస్తానని తేల్చిచెప్పారు.
తాజాగా కేశినేని నాని చేసి వ్యాఖ్యలు టీడీపీలో హాట్ టాఫిక్ గా మారాయి. ఆయన పార్టీ మారతారనే చర్చకు తెరలేసింది. చాలా కాలంగా నుంచి టీడీపీ అధిష్టానంపై ఆయన గుర్రుగా ఉన్నారు. ఒకసారి చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు నిరాకరించారు. మరోవైపు కేశినేని నాని సోదరుడు చిన్ని టీడీపీలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఆయనకు టీడీపీ అధిష్టానం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపథ్యంలో నానికి పార్టీతో దూరం పెరిగిందంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే నానికి వైసీపీ ఆఫర్ ఇచ్చిందా..? మరి పార్టీ మారతారా..? సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు వెళతారా..?