Latest political news telangana: తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తిగా మారాయి. ఇప్పుడు కాంగ్రెస్ కేంద్రంగా పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నుంచి చాలా మంది కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి పరిణామాలతో కాంగ్రెస్ రోజురోజుకు బలపడుతోంది. హస్తం కేడర్ లో జోష్ వచ్చింది. నేతలు ఐక్యంగా పనిచేసేందుకు ముందుకొస్తున్నారు. తెలంగాణలో సామాన్య ఓటర్లు కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మునుగోడు ఉపఎన్నిక సమయంలో బీఆర్ఎస్ కు సీపీఎం మద్దతు ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో సీపీఎం రూటు మార్చింది. తాజాగా సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వామపక్షాలు భేటీ అయ్యాయి. సీపీఎం, సీపీఐ నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తో పొత్తుపై ఇరు పార్టీల నాయకులు చర్చిస్తున్నారు. కేసీఆర్ తో కటీఫ్ అయితే తలెత్తే రాజకీయ పరిణామాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బీఅర్ఎస్ తో పొత్తుపై కమ్యూనిస్టు పార్టీ శ్రేణుల నుంచే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు బీఆర్ఎస్ తో ఒకవేళ పొత్తు ఉన్నా.. చెరొక అసెంబ్లీ స్థానం కంటే ఎక్కువ ఇచ్చే అవకాశంలేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కూడా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. ఇక జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి వామపక్షాలు అడుగులు వేస్తున్నాయి. తెలంగాణలో కూడా కాంగ్రెస్ తో దోస్తీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. దీంతో వామపక్షాలు కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసే యోచనలో ఉన్నాయని అర్థమవుతోంది.