Congress Meeting : జూలై 2 ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. వంద ఎకరాల సభా స్థలిని సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ జనగర్జన సభ పేరు నిర్వహించే ఈ కార్యక్రమం కోసం కాంగ్రెస్ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఇదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అదే రోజు పీపుల్ మార్చ్ పాదయాత్రను సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క ముగిస్తారు. సభా వేదికపై భట్టి విక్రమార్కను ఘనంగా సన్మానించనున్నారు.
ఖమ్మం సభ ద్వారా అసెంబ్లీ ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించాలని కాంగ్రెస్ సంకల్పించింది. ఇప్పటికే పార్టీలో చేరేందుకు నేతల క్యూ కట్టడంతో హస్తం పార్టీలో కొత్త జోష్ వచ్చింది. క్యాడర్ లోనూ నూతనోత్సవం వచ్చింది. ఈ సభలో పాల్గొనేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఈ సభకు 4-5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇలా సభ సక్సెస్ అయితే కాంగ్రెస్ పార్టీ అధికార సాధనకు అడుగులు పడినట్టే. అందుకే నేతలు ఈ మధ్యకాలంలో చాలా ఐక్యతతో పనిచేస్తున్నారు.
ఖమ్మంలో నిర్వహించే కాంగ్రెస్ సభ.. గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. ఈ సభ సక్సెస్ అయితే ప్రజల్లోకి పాజిటివ్ సంకేతాలు వెళతాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు పూర్తిగా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశం ఏర్పడుతుంది. న్యూట్రల్ ఓటర్లు హస్తం పార్టీకి ఒక ఛాన్స్ ఇద్దామని ఆలోచించే అవకాశం ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ ఆందోళన చెందుతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సభ సక్సెస్ కాకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు సభకు హాజరయ్యేందుకు వాహనాలు దొరకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని పొంగులేటి మండిపడ్డారు. ఆర్టీసీ బస్సులను మొదట ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఖాళీ లేవని అంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్నిఇబ్బందులు పెట్టినా ఖమ్మం బహిరంగ సభను విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.