JP Nadda latest news(Political news in telangana): కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ డీలా పడింది. పార్టీలో చేరేందుకు ఇతర పార్టీ నేతలెవరూ ఆసక్తిగా లేరు. మరోవైపు కాషాయ దళంలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ముఖ్యనేతలు వర్గాలుగా విడిపోయారు. పార్టీ నుంచి కొందరు కీలక నేతలు కాంగ్రెస్ లోకి వెళతారనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. కాషాయ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు వచ్చారు.
హైదరాబాద్ నోవాటెల్లో రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలతో జేపీ నడ్డా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రఘునందరావు, విజయశాంతి, వివేక్, పొంగులేటి సుధాకర్రెడ్డి, మురళీధర్రావు పాల్గొన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడొద్దని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో అధికారమే టార్గెట్ పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తో రాజీలేదని తేల్చిచెప్పారు.
సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమంలో భాగంగా రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ తో జేపీ నడ్డా సమావేశమయ్యారు. 9 ఏళ్ల మోదీ పాలనపై రూపొందించిన బుక్ ను నాగేశ్వర్ కు అందించారు.
జేపీ నడ్డాతో భేటీ వివరాలను ప్రొఫెసర్ నాగేశ్వర్ వెల్లడించారు. మోదీ పాలన గురించి నడ్డా వివరించారని తెలిపారు. వివిధ అంశాలపై చర్చించామన్నారు. తన అభిప్రాయాలను జేపీ నడ్డాతో పంచుకున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భేటీలు శుభపరిణామంగా పేర్కొన్నారు. సిద్ధాంతాలు వేరైనా అభిప్రాయాలు పంచుకోవడం మంచిదని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.