BJP Meeting in telangana(Latest political news telangana): తెలంగాణలో అధికారమే లక్ష్యమంటున్న బీజేపీ.. పార్టీ బలోపేతంపై మరింత ఫోకస్ చేసింది. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు నాగర్ కర్నూల్ లో నవసంకల్ప బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ నాసనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మబలిదానాలు చేశారని తెలిపారు. కానీ తెలంగాణ పేరుపై కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని విమర్శించారు. తెలంగాణలో కమలం వికసిస్తేనే ప్రజలు బాగుపడతారని నడ్డా స్పష్టం చేశారు.
తెలంగాణ వికాసం కోసం ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారని నడ్డా వివరించారు. రాష్ట్రాభివృద్ధి కోసం వేల కోట్ల నిధులిచ్చారని తెలిపారు. రాష్ట్రంలో 11,300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నేషన్ హైవేల విషయంలో తెలంగాణకే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 2,300 కిలోమీటర్ల రోడ్లు వేశామన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరణ చేస్తున్నామని తెలిపారు. MMTS సర్వీసుల మెరుగుదలకు సహకరిస్తున్నామని చెప్పారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ రైలు సర్వీసు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ బంద్ చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార రాక్షసుల సమితి అని సెటైర్లు వేశారు.
మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలను నడ్డా సభ వేదికపై వివరించారు. దేశంలో పేదరికం 10 శాతం కంటే తక్కువకు పడిపోయిందని తెలిపారు. 80 కోట్లమందికి కేంద్రం రేషన్ అందిస్తోందని తెలిపారు. కిసాన్ సమ్మాన్ పథకంతో రైతులను ఆదుకుంటున్నామన్నారు. మోదీ నాయకత్వంలో దేశం ముందుకెళుతోందని స్పష్టం చేశారు. భారత్ ఆర్థిక శక్తిగా ఎదుగుతోందన్నారు.
మోదీ విజనరీ లీడర్ అని దేశంలో మౌలిక వసతులు అభివృద్ధి చేశారని నడ్డా అన్నారు. దేశంలో మొబైల్, ఆటోమొబైల్ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. మోదీ బాస్, గ్లోబల్ లీడర్ అని ఆస్ట్రేలియా ప్రధాని అన్న విషయాన్ని గుర్తు చేశారు. అమెరికాలో ప్రధానికి ఎంతో ఆదరణ లభించిందని, ఈజిప్టులో మోదీకి దక్కిన గౌరవం గతంలో ఎవరికీ దక్కలేదని స్పష్టంచేశారు. ప్రపంచం మోదీని పొగుడుతుంటే కాంగ్రెస్ కు కడుపుమండుతోందని నడ్డా మండిపడ్డారు.