YS Sharmila latest news(Political news in telangana) : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు బలంగా జరుగుతున్నాయి. ఆమెకు కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ సీటు ఆఫర్ చేసిందని తెలుస్తోంది. కర్ణాటక కోటాలో రాజ్యసభకు పంపిస్తామని హామీ ఇచ్చిందని సమాచారం. అయితే షర్మిల మాత్రం పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ సీటే ఇవ్వాలని పట్టుబడుతున్నారని టాక్ .
తెలంగాణలో షర్మిలకు చోటు లేదని తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు. షర్మిలను ఏపీ నాయకురాలిగానే జనం చూస్తున్నారంటున్నారు. ఏపీ పాలిటిక్స్లో షర్మిలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగిస్తే స్వాగతిస్తామని కొన్నిరోజుల క్రితం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సహచర పీసీసీ అధ్యక్షుడిగా ఆమెను కలుస్తానని చెప్పారు.
తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించిన షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్రతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను చుట్టేశారు. ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో హాట్ టాపిక్ గా ఉన్నారు. ఈ క్రమంలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. వివాదాలు చుట్టుముట్టాయి.
కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత షర్మిల రూటు మార్చారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో రెండుసార్లు భేటీ అయ్యారు. అప్పటి నుంచి ఆమె కాంగ్రెస్ లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇక వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఈ టాక్ ను షర్మిల ఖండించారు. కానీ తెరవెనుక మంతనాలు నడుస్తున్నాయని అంటున్నారు.
గతంలో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేశారు. అప్పుడు కూడా చిరంజీవిని రాజ్యసభకు పంపారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. ఇదే ఫార్ములాను షర్మిల విషయంలో కాంగ్రెస్ అమలు చేయాలని భావిస్తోందా ? డీల్ ఓకే అయ్యిందా? మరి షర్మిల ఏపీ బాధ్యతలు తీసుకుంటారా? తెలంగాణ నుంచే పోటికి దిగుతారా?