YS Sharmila latest news(Political news today): కాంగ్రెస్ పక్కాగా పావులు కదుపుతోంది. కర్నాటక తర్వాత తెలంగాణే అంటోంది. ఇప్పటికే రేసుగుర్రంలా దూసుకుపోతోంది. పార్టీని గెలుపు గుర్రంగా మార్చేందుకు బలం, బలగాన్ని సమీకరిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు కొట్టగల స్ట్రాంగ్ లీడర్ పొంగులేటిని హస్తం గూటికి చేర్చడంలో సక్సెస్ అయింది. జూపల్లినీ ఆకర్షించి పాలమూరుపై పట్టు పెంచుకోనుంది. ఇలా ఎన్నికల వేళ బలమైన నేతలను.. బలంగా ఆకర్షిస్తోంది హస్తం పార్టీ.
అక్కడితో ఆగిపోలేదు ఆపరేషన్ ఆకర్ష్. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలనూ రారమ్మని పిలుస్తోంది. ఆమె సైతం పొలిటికల్ జంక్షన్లో ఉండటంతో.. చేతిలో చెయ్యేసేందుకు ఆసక్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమారే.. షర్మిలను డీల్ చేస్తున్నారు. త్వరలోనే తెలంగాణ కోడలు.. తెలంగాణ కాంగ్రెస్లో కలిసిపోవడం ఖాయమంటున్నారు.
తాజాగా, షర్మిల భర్త.. బ్రదర్ అనిల్ కుమార్కు AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్ చేశారని సమాచారం. షర్మిలతో, ఆమె తల్లి విజయమ్మతో.. సోనియాగాంధీ మాట్లాడుతారని చెప్పినట్టు తెలుస్తోంది. ఇంకేం. షర్మిల కోసం సోనియాగాంధీనే స్వయంగా రంగంలోకి దిగారంటే.. దాదాపు పని పూర్తైనట్టే.
షర్మిల రక్తంలోనే కాంగ్రెస్ ఉంది. వైఎస్సార్ బలమైన కాంగ్రెస్వాది. ఆయన జీవితమంతా కాంగ్రెస్లోనే గడిచింది. తండ్రి మరణంతో జగన్ సైతం కాంగ్రెస్ తరఫునే ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. అందుకు పార్టీ అంగీకరించకపోవడంవల్లే.. సొంతపార్టీ పెట్టుకున్నారు. జగన్ పోయినా.. ఇప్పుడు వైఎస్ కూతురు షర్మిలనైనా కాంగ్రెస్లో కలిపేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయింది. ఎందుకంటే.. తెలంగాణలో షర్మిల ప్రభావం తీసిపారేసేది కాదు.
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికీ వైఎస్సార్ అభిమానులు భారీగానే ఉన్నారు. ఆయన హయాంలో ఇందిరమ్మ ఇండ్లు పొందినవారు.. ఆరోగ్యశ్రీతో ఆరోగ్యం బాగైనవారు.. ఫీజ్ రీయింబర్స్మెంట్తో చదువుకుని ఉద్యోగాలు సాధించినవారు.. వీధివీధికి ఒక్కరైనా ఉంటారు. ఆ రాజన్న బిడ్డగా.. షర్మిలకు ఎంతోకొంత ఆదరణ తప్పకుండా ఉంటుంది.
అదే షర్మిల.. సొంత పార్టీతో ప్రజల ముందుకు వస్తే.. ఆ లెక్క వేరే అవుతుంది. ఆమె తెలంగాణ వ్యక్తి కాదని.. ఆంధ్రా మనిషని.. పరాయి పార్టీ అని.. ఇలా రకరకాలుగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కానీ, షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే.. కాంగ్రెస్ వాదిగా తెలంగాణ ప్రజల ముందు నిలిస్తే.. ఆ లెక్కే వేరు. కాంగ్రెస్ బలానికి, వైఎస్సార్ క్రేజ్ కూడా తోడై.. పార్టీ దూసుకుపోవడం ఖాయం అంటున్నారు. స్వతహాగా మంచి వాగ్థాటి ఉన్న నాయకురాలు కూడా కావడంతో ప్రచారంలో దూసుకుపోవచ్చు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ లీడర్ భట్టి, ఇతర సీనియర్ నేతల ఇమేజ్కు.. షర్మిల చరిష్మా కూడా తోడైతే.. తెలంగాణలో కాంగ్రెస్కు తిరుగుండకపోవచ్చని అంటున్నారు. అందుకే, పార్టీ విలీనంపై సందేహిస్తున్న షర్మిలకు నచ్చజెప్పి.. ఓకే చెప్పించేందుకు.. స్వయంగా సోనియాగాంధీనే ఎంటర్ అయ్యారని చెబుతున్నారు. ఓవైపు బీజేపీ గ్రాఫ్ పతనమవుతుండటం.. కాంగ్రెస్ దూసుకొస్తుండటంతో.. తెలంగాణలో ట్రయాంగిల్ వార్ కాస్తా.. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారనుందని తెలుస్తోంది. అందుకే, కేసీఆర్ కలవరపడుతున్నారని.. హస్తం పార్టీపై విమర్శల డోస్ పెంచారని.. ఇక షర్మిల కూడా వస్తే.. గులాబీ బాస్కు గుండె గుబేలే అంటున్నారు.