Telangana Today News: హైదరాబాద్ నడిబొడ్డున అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. త్యాగధనుల ఆశయాలు నిత్యం స్ఫూరణకు వచ్చేలా ప్రభుత్వం నిర్మించిన ‘అమర దీపం’ హుస్సేన్ సాగర్ తీరాన రోజూ దేదీప్యమానమై వెలుగనున్నది. తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానం చేసుకొన్న వారి త్యాగాలు నిత్యం ప్రజ్వరిల్లేలా.. తరతరాలకు స్ఫూర్తి రగిలించేలా హైదరాబాద్ నడిబొడ్డున అమరవీరుల స్మారక చిహ్నం నిర్మించింది తెలంగాణ సర్కార్. దశాబ్ది వేడుకల ముగింపు సందర్భంగా ఈ స్మారక చిహ్నాం ఆవిష్కృతమైంది. తెలంగాణ అమరుల స్మారకం- అమర దీపం ప్రజ్వలన.. తద్వారా రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం నిత్యం నివాళి అర్పించనున్నది.
పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్తో ప్రమిద, దీపం ఆకృతిలో స్మారకాన్ని నిర్మించారు.. విభజన రేఖలు లేకుండా పూర్తిగా ఏకరూపంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. జర్మనీ నుంచి నాణ్యమైన స్టీల్ను సమకూర్చుకొని దుబాయ్లో ప్యానెల్స్ తయారు చేసి ఇక్కడకు తీసుకొచ్చి స్మారకం చుట్టూ అమర్చారు. అమరుల త్యాగాల స్ఫూర్తి.. నిత్యం జ్వలించేలా ఉండాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా దీపం ఆకృతిని రూపొందించారు.
ఏడు అంతస్తుల్లో నిర్మితమైన ఈ కట్టడం.. 150 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో స్టెయిన్లెస్ స్టీల్ లోహంతో నిర్మించారు. 85 వేల చదరపు అడుగుల మ్యూజియం ప్రధాన కట్టడంలో 25 వేల చదరపు అడుగుల స్థలాన్ని మ్యూజియంకు కేటాయించారు. దాదాపు 4 వేల చదరపు అడుగుల టెర్రస్ గార్డెన్లో అద్భుతమైన వృక్షాలు.. మిగతా ప్రదేశాన్ని అత్యవసర అవసరాలైన కన్వెన్షన్, ఆఫీస్ రూమ్స్, స్టోర్రూమ్, రీసెర్చ్ హాల్, టాయిలెట్లకు గాను కేటాయించారు. రెండు సెల్లార్ అంతస్తులలో 2 లక్షల చదరపు అడుగుల స్థలం ఉంది. ఇందులో 400 కార్లు, 500 బైక్లు పార్క్ చేసుకొనే వీలు కల్పించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ కట్టడంలో వృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లల సందర్శనార్థం ప్రత్యేక అవసరాలతో తీర్చిదిద్దారు. వీల్ఛైర్, స్ట్రోలర్ నడుపుకునే విధంగా మార్గాలు ఉన్నాయి. లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, ఇతర ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేశారు.
అమరవీరుల స్థూపం ప్రధాన కట్టడం మధ్యభాగంలో పొడవాటి మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్ నిర్మించారు. దానిపై 30 అడుగుల కాంస్య, స్టీల్తో తయారుచేసిన స్తూపం నిర్మించారు. దారి పొడువునా మౌనాన్ని, ప్రశాంతత, నివాళిని అర్పించే శిల్పాలు ఏర్పాటు చేశారు. ఈ స్తూపంలో ముఖ్యమైనది ఉన్న దీపాకృతిలోకి ప్రవేశించిన వెంటనే మ్యూజియం ఉంటుంది. ఇది రెండు భాగాలుగా.. ఒకవైపు చిత్ర, ఛాయాచిత్ర ప్రదర్శన, ఇంకొక వైపు శ్రవణ, వీడియో చిత్ర ప్రదర్శించారు. ఇందులో తెలంగాణ చరిత్ర ప్రతిబింబించే అన్ని అంశాలు పొందుపర్చారు.
ఇక్కడినుండి పై అంతస్తు వెళ్ళడానికి ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ఈ అంతస్తు పూర్తిగా కన్వెన్షన్ హాలుకోసం కేటాయించారు. దాదాపు 700 మందికి పైగా కూర్చోగలిగే హాల్ నిర్మించారు. అమరుల సంస్మరణార్థం ఈ అంతస్తు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆ పైభాగంలో టెర్రస్ గార్డెన్ ఉంటుంది. ఇక్కడినుండి దీపాకృతి ప్రారంభమవుతుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక స్టేజి నిర్మించారు.
ప్రత్యేకమైన కార్బన్ స్టీల్తో ఈ దీపం ఆకృతిని తయారు చేసి.. ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉండేలా రంగులు అద్దారు. పసుపు వర్ణ శోభితంతో దీపం కాంతులీనుతోంది. భూమి నుంచి 45 మీటర్ల ఎత్తుతో ఈ దీపం ఉంది. మొత్తం ఆరు అంతస్థుల్లో స్మారకాన్ని నిర్మించగా.. రెండు బేస్మెంట్ అంతస్థుల్లో వాహనాలకు పార్కింగ్కు కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్, స్టోరేజ్, వర్క్షాప్తోపాటు ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. మొదటి అంతస్థుల్లో మ్యూజియం, లైబ్రరీ, ఆడియో విజువల్ రూం నిర్మించారు. రెండో అంతస్థులో కన్వెన్షన్ హాల్, మూడు, నాలుగు అంతస్థుల్లో రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు.