Telangana : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ముగింపునకు చేరుకున్నాయి. ఈ నెల 2న వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. అప్పటి నుంచి వేడుకలు 21 రోజులపాటు కొనసాగాయి. ఒక్కోరోజు ఒక్కో రంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతిపై కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రగతి నివేదికలు విడుదల చేశారు.
చివరిరోజు గురువారం సాయంత్రం 6.30 గంటలకు తెలంగాణ అమరుల స్మారకం- అమర దీపం ప్రజ్వలన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలకు గుర్తుగా ప్రభుత్వం అమర దీపాన్ని హుస్సేన్సాగర్ సమీపంలో నిర్మించింది. సాయంత్రం 4 గంటలకు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నుంచి 6 వేల మంది కళాకారులతో ప్రదర్శన చేస్తారు. ఈ ప్రదర్శన అమరుల స్మారక కేంద్రం వరకు సాగుతుంది. సచివాలయం, స్మృతివనం వద్ద డ్రోన్ల ద్వారా లేజర్ షో నిర్వహిస్తారు. అమరుల స్మారకం ప్రారంభోత్సవం తర్వాత కేసీఆర్ ముగింపు వేడుకల సభలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి అమరుల కుటుంబాలను ఆహ్వానించారు.
హైదరాబాద్లో అమరుల స్మారక కేంద్రం ఆవిష్కరణకు రావాలని తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను సీఎం కేసీఆర్ ఆహ్వానించారని సమాచారం. సీఎం కార్యాలయం నుంచి ఆహ్వానం అందిందని శంకరమ్మ తెలిపారు. శ్రీకాంతాచారితోపాటు వెయ్యి మంది అమరుల త్యాగాలతో రాష్ట్ర ఏర్పాటు కల సాకారమైందన్నారు.
మరోవైపు గవర్నర్ కోటాలో శంకరమ్మను ఎమ్మెల్సీగా సీఎం కేసీఆర్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ కుమార్రెడ్డిపై శంకరమ్మ పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు. అప్పటి నుంచి ఆమె రాజకీయాలకు కాస్త దూరంగానే ఉన్నారు. ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని చాలాకాలంగా కోరుతున్నారు. తాజాగా కేసీఆర్ నుంచే పిలుపు రావడంతో తనకు కచ్చితంగా పదవి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు.