Pawan Kalyan latest speech(Political news in AP): జనసేన అధికారంలోకి వస్తే.. లా అండ్ ఆర్డర్ను ఆర్డర్లో పెట్టడమే ఫస్ట్ ప్రయారిటీ అన్నారు పవన్ కల్యాణ్. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్స్కు అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు. విశాఖ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారంటే.. రాష్ట్రంలో ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని నిలదీశారు. జనసేన పాలనలో నేరాలను, నేరగాళ్లను అదుపులో పెడతామని.. క్రిమినల్స్ నేరం చేయాలంటేనే భయపడేలా.. పోలీస్ వ్యవస్థను పటిష్ట పరుస్తామని అన్నారు. రౌడీలు, గూండాల కీళ్లు విరగొట్టి సురక్షిత ఏపీగా మారుస్తామని చెప్పారు. విశాఖ ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేసిపారేయలన్నారు పవన్ కల్యాణ్.
వైసీపీ పాలనలో గంజాయి రాజ్యమేలుతోందని మండిపడ్డారు. యువతను మత్తుకు బానిసలను చేస్తున్నారని విమర్శించారు. మంత్రి పెద్దారెడ్డి, కాకినాడ ఎమ్మెల్యే లాంటి వాళ్లు ఇసుక దోచుకుంటూ.. వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. నేరచరిత్ర ఉన్న సన్నాసులా మనల్ని పాలించేదంటూ ఫైర్ అయ్యారు. తాను బతికున్నంత వరకూ.. ఇలాంటి నేరగాళ్లు అధికారంలోకి రాకుండా అడ్డుకుంటానని అన్నారు. ముఖ్యమంత్రికి తానంటే భయమని.. వైసీపీ నేతలకు జనసైనికులంటే భయమని చెప్పారు.
కాకినాడ జిల్లా పిఠాపురం, ఉప్పాడ జంక్షన్లో వారాహి వేదికగా బహిరంగ సభలో మాట్లాడారు పవన్ కల్యాణ్. తనకు సనాతన ధర్మం అంటే గౌరవమని.. మత పిచ్చి మాత్రం లేదన్నారు. పిఠాపురంలో హిందూ ఆలయాలపై జరిగిన దాడులను తీవ్రంగా తప్పుబట్టారు. పిచ్చోళ్లు చేసిన పనిగా చూపించి.. ఇష్యూని పక్కదారి పట్టించారని మండిపడ్డారు. తాను, ఆంధ్రప్రదేశ్ విడిచి వెళ్లనని మరోసారి స్పష్టం చేశారు.
పనిలో పనిగా మాజీ మంత్రి పేర్ని నానిపైనా పరోక్షంగా సెటైర్లు వేశారు. తనకిష్టమైన రెండు చెప్పులను ఎవరో దొంగిలించారని.. గుడి ముందు విడిచిన చెప్పులను ఎత్తుకెళ్లే దొంగలు వైసీపీ వాళ్లంటూ పంచ్లు విసిరారు పవన్ కల్యాణ్.
వారాహి వేదికగా మరో ఎన్నికల హామీని ప్రకటించారు జనసేనాని. అధికారంలోకి వస్తే.. ప్రతి నియోజకవర్గానికి 500 మంది యువతకు.. రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. ఒక్కసారి తనను సీఎంని చేస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానన్నారు జనసేనాని.