Chandrababu naidu kuppam meeting(Political news in AP): వెనక బడిన ప్రాంతం కాబట్టే.. ఆనాడు తాను కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇక్కడి ప్రాంతాన్ని అభివృద్ధి చేశాననే సంతృప్తి ఉందన్నారు. వైసీపీ పాలనలో ప్రజలపై పన్నుల బాదుడు ఎక్కువైందని, సంక్షేమ పథకాలతో 10 రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేస్తున్నారని విమర్శించారు. ఇసుక బకాసురులతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందన్నారు చంద్రబాబు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో ఏపీని నాశనం చేశారని.. ఈ ప్రభుత్వానికి ఇక ఆరు నెలలు మాత్రమే గడువుందని అన్నారు.
కుప్పంలో లక్ష మెజార్టీతో గెలుస్తానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కుప్పంలో రెండోరోజు పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కుప్పంను దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానన్నారు. వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారని.. టీడీపీపై జరుగుతున్న రాజకీయ దాడులపై మండిపడ్డారు. ఎవరినీ వదిలిపెట్టనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.
ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వం ఉందన్నారు. ఉద్యోగులు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారని చెప్పారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మళ్లీ టీడీపీనే గెలవాలని పిలుపు ఇచ్చారు చంద్రబాబు.