Chandrababu kuppam meeting(AP breaking news today): చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటిస్తున్నారు. బుధవారం కర్ణాటక సరిహద్దులో టీడీపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు, చిన్నారిదొడ్డి క్రాస్రోడ్డు కూడలిలో చంద్రబాబు ప్రసంగించారు.
వైసీపీ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని బాబు ఆరోపించారు. కుప్పం నియోజకవర్గంలోని గ్రానైట్ను వైసీపీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. జగన్ అంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎవరూ లేరని మండిపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల ఇదే విమర్శ చేశారని గుర్తు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా విశాఖలో ఇదే అంశాన్ని చెప్పారని.. మరి ఈ సీఎంపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు.
కుప్పంలో పార్టీ నేతలతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. వారికి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పులివెందులలో టీడీపీని గెలిపించకపోయినా.. అక్కడి ప్రజలకు కుప్పం కన్నా ముందుగా నీళ్లు ఇచ్చానన్నారు. తాను హంద్రీ-నీవా పనులు చాలా వరకు పూర్తి చేసి రామకుప్పం వరకు నీళ్లు తీసుకొచ్చానని తెలిపారు. మిగిలిన ప్రాంతానికి జగన్ నీటి తీసుకురాలేకపోయారని విమర్శించారు. టీడీపీని గెలిపిస్తే 18-59 ఏళ్ల మహిళలకు నెలనెలా రూ.1500 జమ చేస్తామని హామీ ఇచ్చారు. పిల్లలను చదవించే వారికి తల్లికి వందనం పేరిట రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. మహిళలు బయటకు వెళ్లాలంటే ఇబ్బందులు పడకూడదనే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి హామీ ఇచ్చానన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరగడం వల్లే 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు.
శాంతిపురం మండలం శివపురం వద్ద ఇల్లు కట్టుకోవడానికి ఈ సీఎం అనుమతి ఇవ్వడం లేదని చంద్రబాబు ఆరోపించారు.ఈ రాష్ట్రమేమైనా మీ తాతల జాగీరా? అని నిలదీశారు. కుప్పం నియోజకవర్గంలో రెండోరోజు చంద్రబాబు పర్యటిస్తారు. బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు. పార్టీలోకి భారీగా చేరికలకు ఉంటాయని తెలుస్తోంది.