Hyderabad latest news today(Telangana BJP news): బీజేపీ మహా ఖతర్నాక్. ఓ రాష్ట్రంపై పట్టు చిక్కించుకునేందకు ఎలాంటి స్కెచ్ అయినా వేస్తుంది. పట్టు చిక్కే వరకూ.. పట్టు వదలకుండా ప్రయత్నిస్తుంది. కర్నాటక ఎన్నికల తర్వాత కమలదళానికి సౌత్ ఇండియా ఛాలెంజింగ్గా మారింది. ఎంత గింజుకున్నా.. కేరళ, తమిళనాడులో వేలు పెట్టడం కష్టంగా మారింది. ఏపీలో అంతా మిత్రులే కాబట్టి నో ప్రాబ్లమ్. ఇక మిగిలింది తెలంగాణే. పంటికింద రాయిలా మారింది కమలనాథులకు. మొన్నటి వరకూ దూకుడుగానే కనిపించినా.. కర్నాటక ఫలితాలతో జోరు.. నీరు కారిపోయింది. ఇదే టైమ్లో కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో దూసుకొచ్చి.. బీజేపీని రేసులో వెనక్కి నెట్టేసింది. పొంగులేటి, జూపల్లి లాంటివారు కాషాయ కండువాకు చిక్కకపోవడంతో మరింత నిరుత్సాహం.
కాంగ్రెస్ ఒక్కసారి బలపడితే.. ఇక ఆ పార్టీని అడ్డుకోవడం అంతఈజీ కాదు. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్.. ఇక తెలంగాణలో బీజేపీకి స్పేస్ ఎక్కడ? ఈసారి గట్టిగా ట్రై చేస్తుంది. అధికారంలోకి వస్తే ఓకే. రాకపోయినా.. బలంగా ఉనికి చాటినా ఓకే. అలా జరగలేదంటేనే నాట్ ఓకే..అంటున్నారు.
బీజేపీ దగ్గర ప్లాన్ బి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. తమ ఆధిపత్యం కోసం ఎందాకైనా వెళ్తుంది. బెంగాల్ నిత్యం అట్టుడుకుతోంది. రాజధాని రాష్ట్రం ఢిల్లీ ఆగమాగం అవుతోంది. గవర్నర్లు, ఆర్డినెన్సులు, దర్యాప్తు సంస్థలు.. ఇలా చేతికందిన అస్త్రాలను ప్రయోగిస్తోంది. మరి, తెలంగాణలో ఏం చేయనుంది?
ఇప్పటికే సీబీఐ, ఈడీ, ఐటీ.. రాష్ట్రంలో ఫుల్ యాక్టివ్గా ఉన్నాయి. గవర్నరూ తనవంతు రోల్ ప్లే చేస్తున్నారు. అయినా, తెలంగాణలో కమల వికాసం జరగకపోతే.. నెక్ట్స్ మూవ్.. హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేసి, తెలంగాణను డిస్ట్రబ్ చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. తాజాగా, మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్ విద్యాసాగర్రావు సైతం ఇలాంటి కామెంట్సే చేయడం కలకలం రేపుతోంది.
రాష్ట్ర విభజన సమయంలోనే దేశానికి సెకెండ్ కేపిటల్గా హైదరాబాద్ చేసే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. అందుకు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆ కాలంలో చేసిన వ్యాఖ్యలే కారణంగా ముందుంచాయి. హైదరాబాద్ లేని రాష్ట్రం మాకొద్దంటూ ఇక్కడి నుంచి తీవ్ర రియాక్షన్ వచ్చింది. అలా కావాలనే లీకులిచ్చి.. ప్రజల ప్రతిస్పందన చూశాక.. ఆ ప్రతిపాదన నుంచి కేంద్రం వెనక్కి తగ్గిందని అంటారు. బీజేపీ తలుచుకుంటే సెకండ్ కేపిటల్ ఇష్యూని మరోసారి కెలికే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
ప్రస్తుతం ఆ ప్రస్తావనే లేకపోయినా.. ఎందుకోగానీ విద్యాసాగర్రావు స్థాయి నేత భారత్కు రెండో రాజధానిగా హైదరాబాద్ అయ్యే అవకాశం ఉందనడాన్ని ఎలా చూడాలి? రాజ్యాంగంలో కూడా ఇదే అంశం ఉందని.. స్మాల్ స్టేట్స్ అనే పుస్తకంలోనూ అంబేద్కర్ ఈ విషయాన్ని రాశారని.. పాత విషయాన్ని కొత్తగా గుర్తు చేయాల్సిన అవసరం ఏముంది? హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందనే నమ్మకం తనకు ఉందంటూ.. అంత కచ్చితంగా ఎలా చెప్పారు? ఆ మేరకు ఆయనకు ఢిల్లీ నుంచి లీకులు ఉన్నాయా? అనే చర్చ జరుగుతోంది.
అయితే, ఇదేమంత సింపుల్ విషయం మాత్రం కాదు. తేనెపట్టును కదిపినట్టే. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ అంత సాహసం చేస్తుందని అనుకోలేం. కానీ, విద్యాసాగర్రావు అలా అన్నారంటే.. నిప్పు లేనిదే పొగ రాదుగా.. అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ముందుముందు తెలంగాణ రాజకీయం ఎలా మారుతుందో.