Political news in telangana: గవర్నర్ తమిళిసై. సీఎం కేసీఆర్. కేంద్రమంత్రి కిషన్రెడ్డి. అరుదైన కాంబినేషన్. నిప్పుఉప్పులా ఉండే వీళ్లు.. ఎంచక్కా.. బుద్ధిగా.. పక్కపక్కనే ఉన్నారు. అట్లుంటది మరి ప్రోటోకాల్ పవర్.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ వచ్చారు. దుండిగల్లో ఎయిర్ఫోర్స్ పరేడ్కు హాజరయ్యేందుకు.. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగారు. అసలే రాష్ట్రపతి. దేశ ప్రథమ పౌరురాలు. త్రివిధ దళాల అధినేత. ప్రెసిడెంట్ వస్తే.. ఎంతటి వారైనా ఎదురెళ్లి స్వాగతం పలకాల్సిందే.
రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు బేగంపేట్ ఎయిర్పోర్టుకు విచ్చేశారు గవర్నర్, సీఎం, సెంట్రల్ మినిస్టర్. అక్కడ కనిపించిందీ ఆసక్తికర సీన్. తమిళిసై, కేసీఆర్, కిషన్రెడ్డిలు.. రాష్ట్రపతి ముర్ముకు స్వాగతం పలికేందుకు.. ఇలా పక్కపక్కనే నిల్చొని ఉన్నారు.
అయితే, ఎడ ముఖం, పెడ ముఖం పెట్టుకొని.. ఎవరికి వారే అన్నట్టు ఉండటం కనిపించింది. తమిళిసై, కేసీఆర్లు ఏమాత్రం మాట్లాడుకోలేదు. కిషన్ రెడ్డి కూడా అంతే. పైగా.. మధ్యలో కేసీఆర్ నిలుచొని ఉంటే.. కిషన్ రెడ్డి వంగి మరి గవర్నర్తో ఏదో మాట్లాడటం కనిపించింది. అంతేకానీ, కేసీఆర్తో వాళ్లిద్దరూ ముచ్చటే లేదు. వాళ్లతో ఈయనా మాట్లాడలేదు. జస్ట్.. కొన్ని నిమిషాల పాటు అలా నిలుచొని.. ప్రెసిడెంట్కు వెల్కమ్ చెప్పేసి.. ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అంతే. ఇంకేం లేదు.
గవర్నర్ వర్సెస్ సీఎం.. ఎపిసోడ్ రాష్ట్రపతి ముర్ము పర్యటన సందర్భంగా మరోసారి కొట్టొచ్చినట్టు కనిపించిందని అంటున్నారు. చాలాకాలంగా గవర్నర్ను అసలేమాత్రం పట్టించుకోవడం లేదు తెలంగాణ సర్కార్. పదే పదే ప్రోటోకాల్ ఉల్లంఘిస్తూ.. ఆమెను అవమానపరుస్తున్నారు కూడా. తమిళిసై సైతం తగ్గేదేలే అంటున్నారు. తన అధికారం మేరకు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతీసారీ.. కేసీఆర్ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు సైతం చేస్తున్నారు. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు కూడా చేశారు. సర్కారు ఫైళ్లపై గవర్నర్ సంతకాలు పెట్టకపోవడంతో.. సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది తెలంగాణ ప్రభుత్వం. ఇలా వారిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది.
అటు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి సైతం కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలు చేస్తుంటారు. బీజేపీ వాయిస్ను గట్టిగా వినిపించే నేతల్లో కిషన్రెడ్డి ఒకరు.
ఇలా ఇటు గవర్నర్, అటు కిషన్రెడ్డి మధ్యలో సీఎం కేసీఆర్ ఉండటం.. పక్కపక్కనే ఉన్నా.. కేసీఆర్తో వాళ్లిద్దరూ టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరించడం.. ముఖ్యమంత్రి సైతం వారిని పెద్దగా పట్టించుకోకపోవడంతో.. రాష్ట్రపతి పర్యటన సాక్షిగా వారి వైరం మరోసారి కెమెరాలకు చిక్కింది. ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.