Amit shah telangana tour(Political news in telangana): కర్ణాటకలో ఓటమి తర్వాత కాస్త కామ్ అయిన కమలం నేతల్లో అమిత్ షా టూర్ జోష్ నింపనుంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటూ చెప్పుకొస్తున్న బీజేపీ నేతలు.. కేంద్ర హోంమంత్రి టూర్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసలెలాంటి బలం లేని జిల్లాలో అమిత్ షా పర్యటనతో పార్టీకి ఎలాంటి మైలేజ్ వస్తుంది..? తెలంగాణ బీజేపీకి ఖమ్మం మీటింగ్.. టర్నింగ్ పాయింట్ అవుతుందా..? మీటింగ్ కు ముందు అమిత్ షా కలవబోయే స్పెషల్ పర్సనాలిటీస్ ఎవరు..?
కర్ణాటకలో పార్టీ ఓటమి కావచ్చు.. లేదా రాష్ట్ర నాయకత్వంలో మార్పు ఉండవచ్చనే ఊహాగానాలు కావచ్చు.. ఏదైతేనేం, గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ వ్యవహారాలు కాస్త నిస్తేజంగా కొనసాగుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన.. నాయకత్వానికి సరికొత్త ఊపిరిపోస్తుందనే భావనలో ఉంది. ఈ క్రమంలో కర్ణాటక ఫలితాల తర్వాత.. తొలిసారిగా తెలంగాణలో అమిత్ షా పాల్గొనబోయే ఖమ్మం సభను.. విజయవంతం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.
ఈ నెల 15 న జరగనున్న ఖమ్మం సభ కోసం అమిత్ షా బుధవారం అర్ధరాత్రి శంషాబాద్ కు చేరుకుంటారు. గురువారం ఉదయం సంచలన దర్శకుడు రాజమౌళీతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలా 45 నిమిషాల నుంచి 12 గంటలా 15 నిమిషాల వరకు జరగనున్న ఈ భేటీ.. రాజమౌళీ నివాసంలో జరగనుంది. అయితే ఈ భేటీలో ఇంకా ఎవరెవరు హాజరవుతారు..? ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి..? అన్న అంశాలు ఆసక్తిగా మారాయి.
ఆ తర్వాత 12 గంటల 45 నిమిషాలకు శంషాబాద్ జేడీ కన్వెన్షన్ లో పూర్వ కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలతో సమావేశం అవుతారు. సాయంత్రం 4 గంటల నుంచి 4 గంటలా 40 నిమిషాల వరకు భద్రాచలం శ్రీ సీతారాచంద్రస్వామి వారిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత 5 గంటలా 40 నిమిషాల నుంచి 5 గంటలా 55 నిమిషాల వరకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తారు.
రాత్రి 6 గంటల నుంచి 7 గంటల వరకు ఖమ్మం బహిరంగ సభలో పాల్గొంటారు. తరలివచ్చిన ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటలా 10 నిమిషాల నుంచి 7 గంటలా 40 నిమిషాల వరకు ఖమ్మం గెస్ట్ హౌజ్ లో రెస్ట్ తీసుకోనున్న అమిత్ షా.. రాత్రి 7 గంటలా 40 నిమిషాలకు ఖమ్మం నుంచి విజయవాడకు వెళ్లనున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు విజయవాడ నుంచి నేరుగా గుజరాత్ కు వెళ్తారు.
ఖమ్మం మీటింగ్ కోసం స్టేట్ బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సుమారు లక్ష మందితో సభ నిర్వహించాలని యోచిస్తుంది. అందుకు తగ్గట్లు ప్రజలను తరలించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తోంది.