KTR News Updates : తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కేంద్రంపై మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. తొలుత ట్వీట్ ద్వారా గవర్నర్ల తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ తర్వాత నేరుగా మీడియా ముందుకొచ్చి .. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. అదానీ కోసమే విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కావాలనే నష్టాల్లోకి నెట్టారన్నారు. నష్టాలను జాతికి అంకితం చేసి లాభాలను దోస్తులకు పంచడమే మోదీ పాలసీ అని విమర్శించారు. ప్రభుత్వరంగంలోని నవరత్నాలను.. మోదీ తన ఇద్దరి ఇష్టరత్నాలకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఛత్తీస్గఢ్లోని బైలదిలా గనులపై కీలక సమాచారాన్ని కేటీఆర్ వెల్లడించారు. బైలదిలా గనులపై అదానీ కన్ను పడిందన్నారు. ఈ గనులు బయ్యారానికి 160 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయన్నారు. ఇక్కడ నుంచి బయ్యారానికి ఐరన్ ఓర్ ఇచ్చేందుకు వీలుకాదని చెప్పారని.. కానీ 1800 కిలోమీటర్ల దూరంలోని ముంద్రాకు తరలించేందుకు ఇప్పుడు సిద్ధమయ్యారని మండిపడ్డారు. బైలదిలా గనులు బయ్యారం, విశాఖకు సమీపంలో ఉన్నాయన్నారు. బైలదిలాలో 1.34 బిలియన్ టన్నుల ఐరన్ ఓర్ లభిస్తుందన్నారు. ఆ గనులు అదానీ చేతుల్లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాలకు నష్టమని కేటీఆర్ స్పష్టం చేశారు.
విశాఖ ఉక్కు కర్మాగారం బిడ్డింగ్లో పాల్గొనే అంశంపై అధ్యయనానికి బృందాన్ని ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. ఆ బృందం నివేదిక ఆధారంగా బిడ్డింగ్లో పాల్గొనడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల సంరక్షణ విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరి ముఖ్యం కాదని అక్కడ కేంద్రం ఏం చేస్తుందన్నదే ముఖ్యమన్నారు.
నిజాం చక్కెర పరిశ్రమను పునరుద్ధరించేందుకు, సిర్పూర్ పేపర్ మిల్లును మళ్లీ తెరిపించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తే ఉద్యోగులు నష్టపోతారు, యువతకు ఉద్యోగాలు లేకుండా పోతాయని తెలిపారు. తెలుగు రాష్ట్రాలపై మోదీ చేస్తున్న కుట్రను ఎండగడతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
అంతకుముందు గవర్నర్ల తీరుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజ్యాంగ పదవులు కేంద్రం చేతిలో రాజకీయ సాధనాలుగా మారాయంటూ తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ప్రస్తావించారు. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలకు కేంద్రం సహాయ నిరాకరణ చేస్తోందన్నారు. చట్టసభల్లో ఆమోదించిన బిల్లులపై ఆమోదముద్ర వేసేందుకు గవర్నర్కు కాల పరిమితి నిర్ణయించాలని రాష్ట్రపతిని, కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ సోమవారం తీర్మానం చేసింది. డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్నాయి. తెలంగాణలోనూ గవర్నర్ బిల్లులను పెండింగ్ లో ఉంచారు . ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఈ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది.