Harish Rao Comments on Governor (Telangana) : తెలంగాణలో పెండింగ్ బిల్లుల వ్యవహారంపై రాష్ట్ర సర్కార్ కు , గవర్నర్ కు మధ్య వివాదం మరింత ముదిరింది. గవర్నర్ వద్ద పలు బిల్లులు పెండింగ్ లో ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న సుప్రీంకోర్టు విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగడానికి ముందు గవర్నర్ మూడు బిల్లులను ఆమోదించారు. రెండింటిని వెనక్కి పంపారు. మరో రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు గవర్నర్ పై తీవ్ర విమర్శలు చేశారు.
బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ పెండింగ్లో పెట్టడం దారుణమని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే కానీ బిల్లులు పాస్ కాని పరిస్థితి నెలకొందన్నారు. గవర్నర్ తీరుపై విమర్శలు గుప్పించారు. మంత్రులు కలిసి వివరించినా గవర్నర్ బిల్లులను ఆమోదించడం లేదని మండిపడ్డారు. ఫారెస్ట్ యూనివర్సిటీ కోసం తీసుకొచ్చిన బిల్లును రాష్ట్రపతి వద్దకు గవర్నర్ పంపారని తెలిపారు. బిల్లులను ఆమోదించకపోవడం రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమే అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను గవర్నర్ దెబ్బతీస్తున్నారని హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు.
కేంద్ర ప్రభుత్వంపైనా హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. దర్యాప్తు సంస్థలను రాజకీయంగా వాడుకుంటోందని మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను బీజేపీ ఆధీనంలో పెట్టుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాలు బయటకు వచ్చేలా చేశారంటూ బీజేపీ నేతలపై మండిపడ్డారు. పిల్లల భవిష్యత్తు కంటే రాజకీయాలు ముఖ్యమా అని ప్రశ్నించారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు హరీష్ రావు పిలుపునిచ్చారు.