Jagan : ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యేందుకు మరో కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలుసుకోవాలన్న లక్ష్యంతో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమానికి శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టింది. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే నినాదం ప్రజల నుంచి వచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత నాలుగేళ్లుగా ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందినవారు మరోమారు ఆశీర్వదించాలని ఈ కార్యక్రమం ద్వారా కోరతారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ఈ నెల 20 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం పూర్తయ్యాక ప్రజా సర్వే ఫలితాలను వెల్లడిస్తారు. దాదాపు 7 లక్షల మంది గృహ సారథులు, సచివాలయాల కన్వీనర్లు 1.60 కోట్ల ఇళ్లను 14 రోజుల్లో సందర్శిస్తారు. ఐదుకోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుంటారు. ‘మమ్మల్ని జగనన్న పంపారు. మీతో మాట్లాడి సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాల్ని తెలుసుకునేందుకు వచ్చాం’ అని చెబుతారు.
ప్రతి ఇంటికి వెళ్లి ‘మీకు ప్రభుత్వం ద్వారా ఏ పథకాలు అందాయి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం గమనించారా?’ అని అడుగుతారు. నాలుగేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో రూ.2 లక్షల కోట్లను సీఎం జగన్ జమ చేశారు. గృహ సారథులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకుంటారు. సీఎం జగన్ నాయకత్వం ఆవశ్యకతను వివరిస్తారు.
గత 46 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రతి ఇంటికీ వెళ్లి వివరిస్తారు. గత సర్కార్కు, ఈ ప్రభుత్వ పాలనకు వ్యత్యాసాన్ని తెలియచేసేలా కరపత్రాలు అందిస్తారు. ఐదు ప్రశ్నలకు అభిప్రాయాలను సేకరించి ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేసి రసీదు ఇస్తారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారిని 82960–82960 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరతారు. ఆ తర్వాత నిమిషంలోపే ఆ కుటుంబానికి ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా సీఎం వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలియచేస్తారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారి ఇంటి డోర్ కు, మొబైల్ ఫోన్కు వారి అనుమతితో సీఎం జగన్ ఫోటోను అతికిస్తారు.