Pawan Kalyan : జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మచిలీపట్నంలో జరిగిన భారీ బహిరంగ సభకు జనసైనికులు పోటెత్తారు. విజయవాడ నుంచి వారాహి వాహనంపై ర్యాలీగా బయలు దేరిన జనసేనానికి అడుగడుగునా అభిమానులు బ్రహ్మరథం పట్టారు. దీంతో చాలా ఆలస్యంగా పవన్ సభా వేదికకు చేరుకున్నారు. అయినా సరే సభా ప్రాంగణం నుంచి అభిమానులు, కార్యకర్తలు తమ నాయకుడి రాక కోసం గంటల తరబడి వేచి చూశారు. సభా వేదికపై పార్టీ లక్ష్యాలు, విధానాలు, వచ్చే ఎన్నికలు ఇలా చాలా అంశాలపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు.
జనసేన బలిపశువు కాబోదు..
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవన్ పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీతో పొత్తులో ఉన్నామని చెప్పారు. టీడీపీతో కలిసి పోటీ చేస్తామనిగానీ, పొత్తు పెట్టుకోమని గానీ చెప్పలేదు. అయితే జనసేన బలిపశువు కాబోదని మాత్రం స్పష్టం చేశారు. ప్రయోగాలు చేయబోమన్నారు. శాసనసభలో అడుగుపెట్టేలాగే తమ ప్రణాళిక ఉంటుందని తెలిపారు. తనతోపాటు పోటీ చేసే అభ్యర్థులంతా గెలిచే తీరాలని తేల్చిచెప్పారు. తాము ఎన్నికల్లో డబ్బులు పంచలేమన్నారు. మీ ఓటు మీరే కొనుక్కుని మాకు ఓటేయండి అని పిలుపునిచ్చారు.
ఒంటరిపోటీకి వెనుకాడం..
దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలన్న వైసీపీ సవాల్ పై పవన్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో జనసేనది బలమైన సంతకం ఉంటుందన్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినా ఎన్నో పోరాటాలు చేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనను గెలిపించి అండగా ఉంటారని ఆశిస్తున్నానని చెప్పారు. జనసేన కచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకం కుదిరితే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికీ వెనుకాడబోమని పవన్ క్లారిటీ ఇచ్చారు. తాను బయటకు వస్తే గజమాలలు వేస్తున్నారని అవి చూసినప్పుడల్లా దండలు కాదయ్యా ఓట్లు వేయండి.. గుండెలు బాదుకోవడం కాదయ్యా.. గుండెల్లో పెట్టుకుని ఓట్లు వేయండి.. అనాలనిపిస్తుందని చెప్పారు. తాను ఏ నిర్ణయమైనా రాష్ట్ర హితం కోరే తీసుకుంటానని పవన్ కల్యాణ్ చెప్పారు.
టీడీపీతో పొత్తుపై..
టీడీపీతో జనసేనకు పొత్తు కుదిరిపోయిందని 20 సీట్లకు అంగీకరించామని వాట్సాప్లో వచ్చే సందేశాలను నమ్మొద్దని జనసైనికులను పవన్ సూచించారు. తన చేతలు మాత్రమే చూడాలని ఊహాగానాలను పట్టించుకోవద్దని చెప్పారు. పదేళ్లు పార్టీని నిలబెట్టానని తనను నమ్మాలని జనసేనాని కోరారు.
బీజేపీతో ప్రయాణంపై..
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని గతంలో తాను అన్నానంటే దానికి కారణాలున్నాయని పవన్ చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని తాము అనుకున్న ప్లాన్ అమలు చేసి ఉంటే టీడీపీ అవసరం లేకుండానే ఎదిగేవాళ్లమన్నారు. అమరావతే రాజధాని అని చెప్పి.. లాంగ్మార్చ్ చేద్దామనుకున్నామని, ఈ ప్రతిపాదనకు ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకులు అంగీకరించారని వెల్లడించారు. కానీ స్థానిక బీజేపీ నాయకుడు అలాంటిదేమీ లేదన్నారని తెలిపారు. బీజేపీ కలిసి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రాకపోతే తానేం చేయగలనని అన్నారు. జనసేన, బీజేపీ కలిసి పోరాడితే.. వైసీపీ వ్యతిరేక ఓటు అనే మాట తన నోటి నుంచి వచ్చేది కాదన్నారు. టీడీపీపై ప్రత్యేకమైన ప్రేమ, చంద్రబాబుపై ఆరాధన తనకు లేవని స్పష్టం చేశారు.
మోదీని నిలదీశా..
విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలని ప్రధాని మోదీని ధైర్యంగా అడిగానని పవన్ కల్యాణ్ చెప్పారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణను తన వల్లే ఆపామనే విషయాన్ని మోదీ గుర్తు చేశారని తెలిపారు. రాష్ట్రమంతా ఒకరోజు బంద్ చేస్తే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి గనులు ఎందుకివ్వరు? అని ప్రశ్నించారు. కార్మికుల్లో పోరాడాలనే కసి లేదన్నారు. వారికే లేనప్పును తాను మోదీతో ఎన్నిసార్లు గొడవ పెట్టుకోను? అని నిలదీశారు.
బీజేపీతో పొత్తు, టీడీపీతో స్నేహం, వచ్చే ఎన్నికల్లో పోటీ ఇలా చాలా అంశాలపై కొంతవరకు జనసేనాని క్లారిటీ ఇచ్చారు. పొత్తులపై మాత్రం పూర్తి స్పష్టత ఇవ్వలేదు. అసలు పవన్ వ్యూహమేంటి..?
Viveka Case : వాళ్ల ప్రమేయం ఉంది.. వివేకా కుమార్తె సంచలన వ్యాఖ్యలు..
Kotamreddy : అసెంబ్లీలో కోటంరెడ్డి నిరసన.. నమ్మకద్రోహి అంటూ వైసీపీ కౌంటర్..