Naveen Murder Case : తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థి నవీన్ హత్యపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తానే హత్య చేసినట్లు నిందితుడు హరిహరకృష్ణ ఇప్పటికే పోలీసులకు లొంగిపోయాడు. అయితే ఈ హత్యపై హరిహరకృష్ణ తండ్రి ప్రభాకర్ అనేక సందేహాలు లేవనెత్తారు. తన కుమారుడు ఒక్కడే హత్యచేయడం సాధ్యంకాదని స్పష్టం చేశారు. ఈ హత్య వెనుక ఇంకా ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. నవీన్ హత్యపై లోతుగా దర్యాప్తు చేయాలని కోరారు. తన కుమారుడిని పోలీసులకు లొంగిపోవాలని తానే చెప్పినట్లు ప్రభాకర్ వెల్లడించారు. కుమారుడిని పోగొట్టుకున్న నవీన్ తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పారు. మరోవైపు నవీన్ ను హత్య చేసిన తర్వాత హరిహర కృష్ణ తన ఫ్రెండ్ తో మాట్లాడిన ఆడియో వైరల్ గా మారింది. హత్య తర్వాత హరి ఏం తెలియదన్నవిధంగా మాట్లాడిన తీరు విస్మయానికి గురిచేస్తోంది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో శనివారం నవీన్ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదమే హత్యకు దారితీసింది. హరిహరకృష్ణ అబ్దుల్లాపూర్మెట్ పోలీసులకు లొంగిపోయిన తర్వాత పెద్దఅంబర్పేట్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతంలో నవీన్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలంలో నవీన్ శరీర భాగాలు వేరువేరుగా పడి ఉన్నాయి. అత్యంత కిరాతకంగా ఈ హత్య చేసినట్లు గుర్తించారు. నవీన్ హత్య వ్యవహారం వెలుగులోకి రావడంతో అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ చేరుకున్న నవీన్ కుటుంబ సభ్యులు.. హరిహరకృష్ణను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత నవీన్ మృతదేహాన్ని వంకరాయి తండాలోని శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
నవీన్ హత్య కేసులో నిందితుడికి కఠిన శిక్షపడేలా చేస్తామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అన్నారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. ఈ హత్య కేసులో ఇతరుల ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపైనా కేసులు నమోదు చేస్తామని రాచకొండ సంయుక్త కమిషనర్ సత్యనారాయణ, ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ స్పష్టంచేశారు. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
TTD: తాటాకు బుట్టల్లో శ్రీవారి లడ్డూలు.. టీటీడీ ఎకో ఏర్పాట్లు..
Preethi : మెడికో ప్రీతి కన్నుమూత.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు..