Bandi Sanjay : జీవో నంబర్ 317కు వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమం చేపడుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. ఈ జీవోపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తామని వెల్లడించారు. స్వరాష్ట్రంలో టీచర్లు పరాయి బతుకు బతకాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. జీవో నంబర్ 317తో ఉపాధ్యాయుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయన్నారు. సీఎం కేసీఆర్ రౌడీ మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ హాయాంలో ఐఏఎస్ అధికారికే రక్షణ లేకుంటే.. సామాన్యుల పరిస్థితేంటని బండి సంజయ్ ప్రశ్నించారు.
ఉద్యోగులు 42 రోజులపాటు సకలజనుల సమ్మె చేయకుంటే కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదని గుర్తుంచుకోవాలని బండి సంజయ్ సూచించారు. కేసీఆర్ను ప్రగతి భవన్ నుంచి బయటకు గుంజుకొచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. టీచర్ల అరెస్ట్ను ఖండిస్తున్నామన్నారు. పోలీసులు కూడా సీఎం కేసీఆర్ బాధితులే అని గుర్తుంచుకోవాలన్నారు. సాటి ఉద్యోగులపై పోలీసుల తీరు బాధాకరంగా ఉందన్నారు.
జీవో నంబర్ 317ను సవరించాల్సేందనని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ జీవోపై టీచర్ల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆ జీవో వల్ల టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే 34 మంది టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు.
తెలంగాణలో టీచర్లు తమ జీతాలు అడుక్కునే పరిస్థితి వచ్చిందని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. 4 డీఏలు ఎందుకు పెండింగ్ లో పెట్టారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 13 జిల్లాల్లో బదిలీలు ఎందుకు ఆపారో చెప్పాలని నిలదీశారు. బదిలీల కోసం బీఆర్ఎస్ నేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. బదిలీలు, ప్రమోషన్లు అంటూ కొత్త డ్రామా షురూ చేశారని మండిపడ్డారు. స్థానికత కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి రావడం దారుణమన్నారు.
మరోవైపు జీవో నెంబర్ 317కు వ్యతిరేకంగా ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రగతి భవన్ వైపు దూసుకెళ్లిన బీజేపీ నేతలను అరెస్టు చేశారు.