Smita Sabharwal : సీఎం కార్యాలయ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి ఓ డిప్యూటీ తహసీల్దార్ అర్ధరాత్రి చొరబడిన వ్యవహారంలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు ఆ సమయంలో ఎందుకెళ్లాడో చిక్కుముడి వీడలేదు. ఈ కేసును పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని ప్లజెంట్ వ్యాలీ బి-11లో స్మితా సబర్వాల్ నివసిస్తున్నారు. ఇక్కడే నగర పోలీసు కమిషనర్ సహా అనేక మంది ఉన్నతాధికారులు ఉంటున్నారు. దీంతో ఈ ప్రాంతంలో నిత్యం కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది.
మేడ్చల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న చెరుకు ఆనంద్కుమార్రెడ్డి , అతడి స్నేహితుడు హోటల్ యజమాని కొత్త బాబుతో కలిసి కారులో ఈ నెల 19న రాత్రి 11.40 గంటల సమయంలో ప్లజెంట్వ్యాలీ వద్దకు వచ్చారు. బి-17కు వెళ్లాలంటూ సెక్యూరిటీ గేట్ వద్ద సిబ్బందికి చెప్పి నేరుగా స్మితా సబర్వాల్ నివాసం బి-11 వద్దకు ఆనంద కుమార్ రెడ్డి చేరుకున్నారు. స్మితా సబర్వాల్ ఇంటి మొదటి అంతస్తులోకి వెళ్లి తలుపు తట్టాడు. నివ్వెరపోయిన ఆమె వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చారు. ఈలోగా భద్రతా సిబ్బంది ఆనంద్కుమార్రెడ్డిని పట్టుకున్నారు. కాసేపటికే జూబ్లీహిల్స్ పోలీసులొచ్చి ఆనంద్ను, కారులో ఉన్న బాబును అదుపులోకి తీసుకొన్నారు. వారిపై ఐపీసీ సెక్షన్ 458, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. స్మితా సబర్వాల్ ఇంట్లోకి ఆనంద్ ప్రవేశించే ముందు.. రాత్రి 11.34 నిమిషాలకు ‘ఎట్ యువర్ డోర్ స్టెప్’అంటూ ఆమెకు ట్వీట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మరోవైపు నిందితుడు ఆనందకుమార్ రెడ్డి ఉన్నత విద్యావంతుడు. ఎమ్మెస్సీ మ్యాథ్స్ చదివారు. లా, జర్నలిజంలో పట్టాలు పొందారు. న్యూఢిల్లీలో వార్త పత్రిక కరస్పాండెంట్గా, దక్కన్ క్రానికల్ ఆసియా ఏజ్ పత్రిక జర్నలిస్ట్గా, సూర్య పత్రిక న్యూఢిల్లీ జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవం ఉంది. ఆనంద్కుమార్రెడ్డి గతంలో చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగం చేశారు. గ్రూపు-2లో ఎంపికై 2018లో హైదరాబాద్లో డిప్యూటీ తహసీల్దార్గా నియమితులయ్యారు. ప్రస్తుతం డిప్యుటేషన్పై పౌరసరఫరాల విభాగంలో పని చేస్తున్నారు. శామీర్పేటలోని అలియాబాద్లో ఆనంద్కుమార్రెడ్డి, బాబు ఒకే భవనంలో ఉంటున్నారు. అసలు ఎందుకు ఆయన అలా చేశారో అంతుచిక్కడంలేదు. నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్ేత పూర్తి వివరాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
రేవంత్ రెడ్డి రీట్వీట్
జరిగిన ఘటనపై స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ పాలనలో మినిమమ్ గవర్నెన్స్.. మ్యాగ్జిమం పాలిటిక్స్ ఫలితం ఇదని మండిపడ్డారు. సింగరేణి కాలనీలో ఆరేళ్ల పసిబిడ్డకే కాదు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఉన్నతాధికారిణికి కూడా భద్రత లేని పాలనలో ఉన్నామని విమర్శించారు. ‘ఆడబిడ్డలూ.. తస్మాత్ జాగ్రత్త’ అంటూ తెలంగాణ సీఎంవో, హైదరాబాద్ పోలీస్, తెలంగాణ డీజీపీలకు ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు.
స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబాటు ఘటనపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ ఘటనపై రాజకీయ నేతల నుంచి కాదు అన్నివర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత కీలక పదవిలో ఉన్న మహిళా అధికారికే భద్రత లేకపోతే ఎలా అనే ప్రశ్నలు ఎదురువుతున్నాయి. కేసీఆర్ సర్కార్ యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
మరోవైపు స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడిన వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్కుమార్రెడ్డిని మేడ్చల్ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. కలెక్టర్ ఆదేశాలను చంచల్గూడ జైలులో ఉన్న నిందితుడికి రెవెన్యూశాఖ అధికారులు అందించనున్నారు.