Finance Department : వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్ పై కసరత్తు చేస్తున్న కేంద్ర ఆర్థికశాఖకు షాక్ తగిలింది. ఆర్థికశాఖ సమాచారం విదేశాలకు లీక్ అయ్యింది. ఈ గూఢచర్యం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆర్థికశాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తోన్న ఓ వ్యక్తి.. అత్యంత రహస్య సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నట్లు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. సదరు కాంట్రాక్టు ఉద్యోగిని అరెస్ట్ చేశారు.
గూఢచర్యం ఆరోపణలతో ఆర్థికశాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న సుమిత్ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న నిందితుడు కొంతకాలంగా ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన కీలక సమాచారాన్ని విదేశాలకు అందిస్తున్నాడని గుర్తించారు. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బు తీసుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు. అధికారిక రహస్యాల చట్టం కింద సుమిత్ పై కేసు నమోదు చేశారు. సమాచారాన్ని చెరవేసేందుకు నిందితుడు ఉపయోగించిన మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల కేంద్ర మంత్రిత్వ శాఖల్లో తరచూ గూఢచర్య ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు దేశ భద్రతకు సవాలుగా మారుతున్నాయి. గతేడాది నవంబర్ లో గూఢచర్యం ఆరోపణలపై విదేశాంగ మంత్రిత్వశాఖలో పనిచేస్తోన్న డ్రైవర్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్కు చెందిన ఓ మహిళ వలపు వలలో చిక్కుకుని ఆ డ్రైవర్.. విదేశాంగ శాఖకు చెందిన కీలక సమాచారాన్ని చేరవేశాడు.
2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమయంలో ఈ గూఢచర్యం ఘటన బయటకు రావడం ఆందోళన కలిగిస్తోంది. బడ్జెట్కు సంబంధించిన పత్రాలు విదేశాలకు లీకైతే.. దేశ మార్కెట్పై ప్రతికూల ప్రభావం పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ఇలాంటి గూఢచర్యం ఘటనలు జరగకుండా కేంద్రం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణలు అంటున్నారు.