Election Commission : కొత్త ఏడాదిలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ ఏడాది మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలుత మూడు ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించేందుకు సిద్ధమైంది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడించనుంది. ఈ మూడు రాష్ట్రాల ప్రస్తుత శాసనసభల పదవీకాలం మార్చితో ముగియనుంది. ఇటీవలే కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్కుమార్ నేతృత్వంలోని ఈసీ బృందం ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికలపై రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీసు సిబ్బంది అభిప్రాయాలు సేకరించింది.
ప్రస్తుతం త్రిపుర , మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. త్రిపుర లో మాణిక్ సాహా నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రూలింగ్ లో ఉంది. మేఘాలయ , నాగాలాండ్ లో కాషాయ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాలను నడుపుతోంది. ఈ 3 రాష్ట్రాల తర్వాత కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభల పదవీకాలం ఈ ఏడాదిలోనే ముగియనున్నాయి. కర్నాటక , మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రాలను తిరిగి నిలబెట్టుకునేందుకు కాషాయ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. అటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ పైనా కమలనాథులు గురిపెట్టారు. అక్కడ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.
అటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చింది. ఈ ఏడాది ఎన్నికల జరిగే కర్నాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో రాహుల్ గాంధీ పాదయాత్ర చేయడం కలిసొస్తుందని హస్తం పార్టీ అంచనా వేస్తోంది. మొత్తం మీద 2024 ఎన్నికలకు ముందు జరిగే ఈ 9 రాష్ట్రాల ఎన్నికలు ఎంతో కీలక కానున్నాయి. అందుకే అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ ఫలితాలే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిబింబిస్తాయనే అంచనాలున్నాయి. అందుకే మిషన్ 2024 కు బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని జాతీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.