Population : అన్నిరంగాల్లో వేగంగా దూసుకెళ్తున్న భారత్ లో జనాభా పెరుగుదలలోనూ అదే స్పీడ్ ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. భారత్ జనాభాలో చైనాను దాటేసింది. ఈ విషయాన్ని వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదిక వెల్లడించింది. 2022 డిసెంబర్ చివరి నాటికి భారత జనాభా చైనా కంటే కనీసం 50 లక్షలు ఎక్కువని ఆ నివేదిక స్పష్టం చేసింది.
2022 డిసెంబర్ 31 నాటికి తమ దేశ జనాభా 141.2 కోట్లని చైనా మంగళవారం అధికారికంగా ప్రకటించింది. 1961 తర్వాత తొలిసారిగా 2022లో తమ జనాభాలో 8.5 లక్షల మేర తగ్గుదల నమోదైనట్టు చైనా ప్రకటించింది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2050 నాటికి డ్రాగన్ జనాభా 131 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా వేస్తోంది.
2022 డిసెంబర్ 31 నాటికి భారత్ జనాభా 141.7 కోట్లకు చేరిందని డబ్ల్యూపీఆర్ అంచనా వేసింది. తాజాగా బుధవారం నాటికి భారత్ జనాభా 142.3 కోట్లకు చేరుకుందని ప్రకటించింది. మాక్రోట్రెండ్స్ అనే మరో సంస్థ అంచనాల ప్రకారం బుధవారం నాటికి భారత జనాభా 142.8 కోట్లు అని తేలింది. భారతదేశ జనాభాలో 50 శాతానికి పైగా 30 ఏళ్ల లోపు వయసువారే ఉన్నారు. అందువల్ల దేశ జనాభా పెరుగుదల 2050 దాకా కొనసాగుతూనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2050 నాటికి భారత జనాభా 166 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నారు. అంటే అప్పటికి చైనా కంటే భారత్ జనాభా 35 కోట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
పదేళ్లకోసారి దేశంలో జనాభాను లెక్కిస్తున్నారు. అయితే 2020లో జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో దేశ జనాభాపై అధికారికంగా తాజా గణాంకాలు అందుబాటులో లేవు. మరో మూడు నెలల తర్వాత చైనా జనాభాను భారత్ అధిగమిస్తుందని గతంలో అంచనా వేశారు. కానీ అంతకంటే ముందే చైనాను భారత్ దాటేసిందని డబ్ల్యూపీఆర్ అంచనా వేసింది. భారత్ జనాభా లెక్కలు వస్తే పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుంది.