CM KCR news today(Political news in telangana): కేసీఆర్ టార్గెట్ మార్చారు. బీజేపీని వదిలేసి.. కాంగ్రెస్పై అటాక్ చేస్తున్నారు. ఒకప్పుడు తెలంగాణలో అంతగా హడావుడి లేని బీజేపీని.. కేసీఆరే పైకి లేపారు. కాంగ్రెస్కు ధీటుగా కమలనాథులకు హైప్ క్రియేట్ చేశారు. కేసీఆర్ పాచిక పారి.. తెలంగాణలో కాషాయ పార్టీ రాటుదేలింది. ఢీ అంటే ఢీ అనేలా సమఉజ్జీ స్థాయికి చేరింది. ఇక కాంగ్రెస్ పని ఖతం అనుకుంటున్న సమయంలో.. కర్నాటక ఎన్నికల ఫలితాలు కేసీఆర్ను కలవరపాటుకు గురి చేసినట్టున్నాయి. అసలే కాంగ్రెస్ పార్టీ. ఫీనిక్స్ పక్షి లాంటిది. శూన్యం నుంచి కూడా ఎగరగల సత్తా ఆ పార్టీ సొంతం. అలాంటిది తెలంగాణలో ఇప్పటికీ గ్రామగ్రామాన గట్టి బలం ఉన్న హస్తం పార్టీ మళ్లీ పుంజుకుంటే? కర్నాటక ఫలితాలతో మళ్లీ యాక్టివ్ అయితే? ఇదే గులాబీ బాస్ గుబులుకు కారణం అంటున్నారు.
ఇంకేం.. వెంటనే ప్లాన్ బి స్టార్ట్ చేసేశారు కేసీఆర్. ఇన్నాళ్లూ కాంగ్రెస్ను పట్టించుకోకుండా బీజేపీనే టార్గెట్ చేస్తూ వచ్చిన ఆయన.. ఇటీవల హస్తం పార్టీపైనే తుపాకీ ఎక్కుపెడుతున్నారు. నిర్మల్ సభలో, నాగర్ కర్నూల్ మీటింగులోనూ.. కాంగ్రెస్ కార్నర్గానే మాటల దాడి చేశారు. ధరణిని బంగాళాఖాతంలో కలుపుతారట..అంటూ నేరుగా రేవంత్రెడ్డిపైనే అటాక్కు దిగారు. ఇన్నాళ్లూ రేవంత్ విమర్శలను అస్సలు పట్టించుకోనట్టు కనిపించిన కేసీఆర్.. సడెన్గా పీసీసీ చీఫ్ టార్గెట్గా వాయిస్ రెయిజ్ చేయడం ఆసక్తికరంగా మారింది.
నాగర్ కర్నూల్ కేసీఆర్ ప్రసంగంలో కాంగ్రెస్పై విమర్శలకే అధిక సమయం కేటాయించారు. కొత్త వేషాలతో మళ్లీ మోసగాళ్లు బయలుదేరారని.. రైతులపై కాంగ్రెస్ కుట్ర చేస్తోందని.. నమ్మి అధికారమిస్తే పంటికి అంటకుండా మింగేయడానికి సిద్ధంగా ఉన్నారని.. కాంగ్రెస్ రాజ్యంలో దళారులు, పైరవీ కారులదే భోజ్యమని.. మళ్లీ మనల్ని మింగేయడానికి వస్తున్నారని.. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మొద్దని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ సర్కారుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని.. కాంగ్రెస్ దుర్మార్గులను మళ్లీ గెలిపించవద్దని.. మోసపోతే గోసపడతామని.. ఇలా కేసీఆర్ స్పీచ్ అంతా కాంగ్రెస్ చుట్టూనే తిరగడం చర్చనీయాంశమైంది.
కర్నాటక ఎన్నికల తర్వాత బీజేపీ ప్రస్తావనే చేయట్లేదు కేసీఆర్. అంటే, తెలంగాణలోనూ కర్నాటక ఫలితాలు రిపీట్ అవుతాయని భావిస్తున్నారా? బీజేపీ ఓడినా.. కాంగ్రెస్ గెలుస్తుందేమోననే ఆలోచననే ఆయన తట్టుకోలేకపోతున్నారా? అందుకే, కమలనాథులను లైట్ తీసుకుంటూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు దిగుతున్నారా? అందులోనూ, ఇటీవల కాంగ్రెస్ నిర్వహిస్తున్న అన్ని బహిరంగ సభలు భారీగా సక్సెస్ అవుతుండటంతో కలవరపడుతున్నారా? హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, ప్రియాంక గాంధీ ఎంట్రీ, భట్టి పాదయాత్ర, రేవంత్ దండయాత్రతో.. కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారా? అందుకే, బీజేపీపై కాకుండా.. కాంగ్రెస్పైనే విమర్శల డోసు పెంచారా?