Revanth Reddy Latest News(Telangana politics): కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికారంలోకి రాగానే.. కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు.. కేసీఆర్ కుటుంబం మొత్తానికి జైళ్లో ఓ డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తామంటూ హాట్ కామెంట్ చేశారు రేవంత్.
ధరణి పోర్టల్ తీసుకొచ్చి వేల ఎకరాల దోపిడీ చేశారని సీఎం కేసీఆర్పై రేవంత్రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు పంచిన భూములు రికార్డులు లేకుండా చేశారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ ఎన్ని మాట్లాడినా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని రద్దు చేస్తామన్నారు.
ధరణి పోర్టల్ రద్దు చేస్తే.. రైతు బంధు ఆగిపోతుందనేది కేవలం విష ప్రచారం మాత్రమేనని రేవంత్ అన్నారు. ధరణి పోర్టల్ రాకముందు రైతు బంధు అందలేదా? అని ప్రశ్నించారు.
అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని కేటీఆర్కు సవాల్ విసిరారు పీసీసీ చీఫ్. కాంగ్రెస్ హయాంలోని పథకాలకు పేర్లు మార్చి పాలన చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ సర్కార్.. కొత్తగా ఒక్క పథకం కూడా తీసుకురాలేదన్నారు.
సీఎం కేసీఆర్, పీఎం మోదీపై సెటైర్లు విసిరారు రేవంత్రెడ్డి. కేసీఆర్ పనికిరాని వెయ్యి రూపాయల నోటు లాంటోడని.. మోదీ వాపస్ తీసుకున్న 2వేల నోటు లాంటి వాడని పంచ్లు వేశారు. వారిద్దరితో దేశానికి కానీ.. రాష్ట్రానికి కానీ ఎలాంటి ప్రయోజం లేదన్నారు.
యూత్ కాంగ్రెస్ లో కష్టపడే వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారని రేవంత్ అన్నారు. యూత్ కాంగ్రెస్ నేతలు కలిసి కష్టపడితే.. కాంగ్రెస్కు అధికారం ఖాయమని తెలిపారు. మానిక్ రావు ఠాక్రే సైతం యూత్ కాంగ్రెస్ నుంచే ఈ స్థాయికి వచ్చారని గుర్తు చేశారు రేవంత్రెడ్డి.