Raghunandan Rao latest news(Political news today telangana): తెలంగాణ బీజేపీలో అసంతృప్తి రాజ్యమేలుతోంది. నేతలంతా ఒక్కొక్కరుగా అధిష్టానంపై తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఇప్పటి వరకు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి పేర్లు బయటకు రాగా.. తాజా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆ జాబితాలో చేరారు.
కొద్దిరోజులుగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న పలు పరిణామాల ఆ పార్టీ శ్రేణులను కలవర పెడుతున్నాయి. రాష్ట్రంలోని కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నా.. కేంద్రం నుంచి సహకారం అందడం లేదన్న భావన ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా నాటుకొని పోయింది. దీంతో ఆ పార్టీ నాయకులు ఒక్కక్కరుగా తమ గళాన్ని విప్పుతున్నారు. తెలంగాణలో బీజేపీకి తన గెలుపుతోనే ఊపు వచ్చిందంటున్న రఘునందన్ రావు.. ఇటీవల తన అనుచరులతో చేసిన కామెంట్స్ సంచలనాన్ని రేపుతున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాడుతున్న తనకు పార్టీ నుంచి ఎలాంటి సహకారం లేదని ఎమ్మెల్యే రఘునందన్ తన అనుచరులతో వాపోయినట్లు తెలుస్తోంది. గ్రూపురాజకీయాలకు చేస్తున్న వారికే హైకమాండ్ అండదండలు ఉన్నాయన్న ఆయన.. బీజేపీ ఫ్లోర్ లీడర్ పదవి అడిగినా ఇంతవరకూ తనకు ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ తర్వాత నుంచి ఫ్లోర్ లీడర్ పదవి ఖాళీగానే ఉంది. జాతీయ అధికార ప్రతినిధి లేదా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అవకాశం వస్తుందని ఆశించిన రఘునందన్ రావులో.. కనీసం రాష్ట్ర పార్టీలో కూడా ప్రాధాన్యత దక్కకపోవడం అసంతృప్తిని రేపింది.
ఇటీవల హైదరాబాద్ వచ్చిన పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా.. ఎమ్మెల్యే రఘునందన్ రావు తన అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ పార్టీ పెద్దలు మాత్రం తనను చిన్న చూపు చూస్తున్నారన్న భావనలో ఆయన ఉన్నట్లు సమాచారం.