Telangana formation day celebrations(Today’s state news): తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. నేడు చెరువుల పండుగను నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చెరువుల వద్ద కట్ట మైసమ్మకు పూజలు చేస్తారు. బోనాలు సమర్పిస్తారు. బతుకమ్మ ఆడతారు. ప్రగతి నివేదిక ప్రదర్శించేందుకు సర్వం సిద్ధం చేశారు.
సాయంత్రం 4 గంటలకు చెరువుల వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత మిషన్కాకతీయ డాక్యుమెంటరీలను అక్కడ ప్రదర్శిస్తారు. వేడుకల్లో ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఉత్సవాల్లో పాల్గొనాలని మిషన్ కాకతీయ దాతలను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
చెరువుల పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు. అధికారులకు బాధ్యతలను అప్పగించామన్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు. నియోజకవర్గస్థాయిలో ప్రగతి నివేదికలను ప్రత్యేకంగా రూపొందించామని వివరించారు. ఉత్సవాల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చెరువుల పండుగను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.