Irrigation day in telangana(TS news updates) : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. బుధవారం సాగునీటి దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించేందుకు సాగునీటి పారుదలశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులు, డ్యామ్ లను విద్యుద్దీపాలతో అలంకరించారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.
ఈ 9 ఏళ్లలో సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిపై నియోజకవర్గాలవారీగా రూపొందించిన నివేదికలను విడుదల చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్కాకతీయ పథకం ద్వారా సాధించిన ఫలితాలపై రూపొందించిన డాక్యుమెంటరీలను ప్రదర్శిస్తారు. అన్నారం బ్యారేజ్ వద్ద లేజర్ షో నిర్వహిస్తారు.
తెలంగాణలో సాగునీటి రంగ అభివృద్ధి కృషి చేసిన అధికారులను సన్మానించనున్నారు. రాష్ట్రస్థాయిలో ఈఎన్సీ, సీఈ, ఎస్ఈ, ఒక విశ్రాంత ఇంజినీర్కు అవార్డు ప్రదానం చేస్తారు. టెరిటోయరిల్ స్థాయిలో ఈఈ, డీఈఈ, ఏఈ , ఒక విశ్రాంత ఇంజినీర్కు పురస్కారం అందజేస్తారు. జిల్లాలవారీగా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని వేడుకలు నిర్వహించాలని సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ అధికారులను ఆదేశించారు.